ఏపీ మంత్రుల పై ఏవేవో వార్తలు వచ్చేస్తున్నాయి.ఆయన ముఖ్యమంత్రి జగన్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎదుటివారిపై ఒంటికాలి మీద లేస్తున్న జగన్ తన సొంత మంత్రుల విషయంలో మౌనముద్ర దాల్చడ౦ ఏమిటంటున్నారు ఆయన బద్ద వ్యతిరేకులు!ముఖ్యమంత్రి జగను కి సమీప బంధువైన ఒక మంత్రికి సంబంధించిన వాహనంలో తమిళనాడులో కోట్ల రూపాయలు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఫోకస్ చేసిన మీడియాపై సదరు మంత్రి పరువు నష్టం దావా వేశారు. డబ్బు పట్టుబడ్డ వాహనానికి ఉన్న స్టిక్కర్ తో తనకు సంబంధం లేదని సదరు మంత్రి బుకాయి౦చారు.ఇక మరో మంత్రి గోడౌన్లో గుట్కాతయారీ ఫ్యాక్టరీ వెలుగు చూసింది .
సదరు సచివుడు కూడా ఆ ఫ్యాక్టరీకి తనకు సంబంధం లేదని చెప్పేశారు.తాజాగా ఈ తరహాలోనే మరో మంత్రి స్వగ్రామంలో పేకాట డెన్ బయటపడింది.కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా లెచిన గుమ్మనూరు జయరాం మంత్రి అయ్యారు. ఆయన ఇంటి పేరు.. ఆయన స్వగ్రామం పేరు ఒకటే. అదే గుమ్మనూరు. ఆయన బంధువర్గం మొత్తం అక్కడే ఉంటుంది. ఇటీవలి కాలంలో గుమ్మనూరు బాగా ప్రసిద్ధి చెందింది. కర్నూలు జిల్లా గుమ్మనూరు అడ్రస్ ఎక్కడ అని కనుక్కుని.. కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఖరీదైన కార్లలో వస్తున్నారు.
ఎందుకంటే అక్కడ నడుస్తున్న పేకాట డెన్ లో పేకాట ఆడుకోవడానికి. స్వయంగా మంత్రిగారి ఇలాఖా కాబట్టి ఆయనకు తెలియకుండా పోలీసు కూడా అడుగు పెట్టే చాన్స్ లేదన్న భరోసాతో అందరూ అక్కడకు వచ్చి పేకాడేసుకుంటున్నారు. రోజుకు కోట్లలోనే లావాదేవీలు జరుగుతున్నాయి. కమిషన్ రూపంలో కనీసం రూ. పది లక్షలు రోజుకు మంత్రి క్యాంప్కు అందుతాయని చెప్పుకుంటూ ఉంటారు.అయితే ఎవరో పోలీసులకు సమాచారం అందించారు. అంత పెద్ద పేకాట డెన్ నడుస్తూంటే ఇప్పటి వరకూ పోలీసులకు తెలియదా అనేది చిదంబర రహస్యం.
తెలిసినా ఎటాక్ చేసే ధైర్యం వారికి లేదు. వైసీపీలోనే పెద్ద తలకాయ ఎవరో రంగంలోకి దిగడంతో పోలీసులకు ధైర్యం వచ్చింది ఆ పేకాట డెన్ మీద రైడ్ చేశారు.బాగోతం అంతా పోలీసులు బయటపెట్టారు. మంత్రి సోదరుడే పేకాట డెన్ నిర్వాహకుడని పోలీసులు తేల్చేశారు. అయితే కాసేపటికే మంత్రి నుంచి తనకు,తన కుటుంబసభ్యులకు పేకాట డెన్ తో ఏం సంబంధం లేదని ప్రకటన వచ్చేసింది. ఇంతటితో కథ కంచికి చేరినట్టే!అయితే మంత్రుల భాగోతాలపై ముఖ్యమంత్రి నోరు మెదపక పోవడం అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు!మంత్రులు చెప్తున్న కాకమ్మ కహానీలను కూడా ప్రజలు నమ్మడం లేదు!