అమరావతి: కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాలపై మొదటి నుండి పోరాటం చేస్తున్న మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజావేదిక కూల్చివేతపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని ఆళ్ల అన్నారు. ప్రజావేదిక కూల్చివేత పనులను బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంలో ఆళ్ల మీడియాతో మాట్లాడుతూ కరకట్ట మీద 60కి పైగా ఖరీదైన భవనాలు ఉన్నాయనీ, వాటన్నింటికీ నోటీసులు ఇప్పించామన్నారు. ఈ నెల 21న దీనికి సంబంధించిన కేసులు న్యాయస్థానం ముందుకు రావాల్సి ఉండగా చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేశారని ఆళ్ల ఆరోపించారు. ప్రజావేదిక నిర్మాణ స్థలాన్ని ఇద్దరు రైతులను బెదిరించి బలవంతంగా లాక్కున్నారని ఆళ్ల ఆరోపించారు. రైతులు దాసరి నాగయ్య, దాసరి సాంబశివరావులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆళ్ల పేర్కొన్నారు.
ప్రజావేదిక కూల్చివేత తర్వాతైనా చంద్రబాబు అక్కడి తన నివాసం ఖాళీ చేయాలని ఆళ్ల అన్నారు. చంద్రబాబు ఆ నివాసం ఖాళీ చేసే వరకూ తాను వదిలిపెట్టనని స్పష్టం చేశారు. మిగిలిన అక్రమ నిర్మాణదారులు స్వచ్చందంగా ఖాళీ చేస్తే మంచిదని ఆళ్ల పేర్కొన్నారు.
ప్రజావేదిక కూల్చివేతపై రాద్ధాంతం అనవసరమనీ, చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆళ్ల స్పష్టం చేశారు.