అమరావతి: చంద్రబాబు తప్పును సరిదిద్దుకోకపోతే ప్రకృతి ప్రకోపానికి గురి అవుతారని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శనివారం తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తక్షణమే కరకట్టపై ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం మంచిదనీ, ఆయన క్షేమం కోసమే తాను చెబుతున్నామని అంబటి అన్నారు.
కృష్ణానదికి ఈ స్థాయి వరద రావడం అరుదనీ, పదేళ్ల క్రితం ఈ మాదిరి వరద వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రజలు కృష్ణానదీ ప్రవాహం చూసి ఆనందిస్తున్నారన్నారని అంబటి అన్నారు. అందరూ ఆనందంగా ఉంటే ఒక కుటుంబానికి బాధగా ఉందని అంబటి వ్యాఖ్యానించారు.
కృష్ణా నది వరద తన కొంప ముంచడానికి వచ్చిందని చంద్ర బాబు ఆందోళన చెందుతున్నారని అంబటి విమర్శించారు. హై సెక్యురిటి జోన్లో ఉన్న చంద్రబాబు ప్రమాదకరమైన ఇంట్లో ఎందుకు ఉంటున్నారని అంబటి ప్రశ్నించారు. ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ కు వచ్చినంత కోపం నేడు చంద్రబాబుకు వచ్చిందని అంబటి అన్నారు. ఆయన నివాసం ఉంటున్నది అక్రమ కట్టడమనీ, నది ప్రవాహంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందే చెప్పారని అంబటి గుర్తు చేశారు. అయినా చంద్రబాబు తప్పని తెలిసి కూడా మొండిగా అక్కడే వుంటున్నారని అంబటి అన్నారు.
రాజకీయంగా చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయిందనీ అంబటి వ్యాఖ్యానించారు. నీచమైన ప్రచారాల వల్లే ప్రజలు ఆయనకు ఛీ కొట్టారని అంబటి పేర్కొన్నారు. ఇంటి విషయంలో తప్పు చేస్తూ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారని అంబటి విమర్శించారు. ఆయన ఇంటికి నోటీస్ ఇచ్చేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని కూడా రానివ్వకుండా సిబ్బంది అడ్డుకున్నారని అంబటి పేర్కొన్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అమరావతిలో సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదని అంబటి ప్రశ్నించారు.
previous post
next post