అమరావతి: ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, టిడిపి అధినేత చంద్రబాబు పల్నాడుపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారనీ వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు వైసిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అత్మకూరులో, పల్నాడులో ఏమి జరగకపోయినా చంద్రబాబు, టిడిపి నేతలు అక్కడ ఏదో జరుగుతోందంటూ విషపు ప్రచారం చేస్తున్నారని అంబటి ఆరోపించారు.
చంద్రబాబు పాలనలో పల్నాడు ప్రాంతంలో యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాదరావు, ఆంజనేయులు, పుల్లారావు తదితర టిడిపి నేతల కనుసన్నల్లో అనేక ఘోరాలు, నీచమైన పనులు జరిగాయని, వారి బాధితులు ఎంతో మంది ఉన్నారని అంబటి అన్నారు. ఆ టిడిపి నేతల బాగోతాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించడానికి చలో ఆత్మకూరు అంటూ డ్రామాలు అడుతున్నారని అంబటి విమర్శించారు. తమ పార్టీ కూడా చలో ఆత్మకూరుకు పిలుపు ఇచ్చిందనీ, ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వ హయాంలో బాధిత వైసిపి శ్రేణులకు పిలుపు నివ్వగా పెద్ద సంఖ్యలో టిడిపి బాధితులు పార్టీ కార్యాలయానికి వచ్చారనీ అంబటి చెప్పారు.
తాము చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడం వల్ల ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించుకున్నామని అంబటి అన్నారు. చంద్రబాబు వెళ్లినా వెళ్లకున్నా తాము పోలీసుల అనుమతితో త్వరలో ఆత్మకూరు వెళ్లి బాధితులను సమావేశపరుస్తామనీ, బహిరంగ విచారణ జరిపి అక్కడ ఏమి జరుగుతుందో వాస్తవ పరిస్థితులను మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తామని అంబటి పేర్కొన్నారు.
చంద్రబాబు చెప్పినట్లుగా ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో ఎ విధమైన ఘోరాలు జరగడం లేదనీ, ఎవరినీ వేధించడం లేదనీ అంబటి అన్నారు. పల్నాడులోని పలు గ్రామాల్లో వూర్వం నుండి ఫ్యాక్షన్ ఉన్నమాట వాస్తవమేననీ, చంద్రబాబు హయాంలో మాచర్లలో ఒకే రోజు ఏడు హత్యలు జరిగాయనీ అంబటి గుర్తు చేశారు. ఆత్మకూరులోనూ కొంత ఫ్యాక్షన్ ఉన్నదని ఆయన అన్నారు. టిడిపి విషపు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అంబటి పేర్కొన్నారు.
సమావేశంలో వైసిపి ఎమ్మెల్యేలు కాసు మహేశ్ రెడ్డి, లావు కృష్ణదేవరాయలు, ముస్తఫా, విడతల రజిని తదితర నేతలు పాల్గొన్నారు.