రాజీనామా చేస్తా.. రా ..చూసుకుందాం అంటూ గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అన్నా రాంబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు.
ఈ నిమిషంలో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గిద్దలూరులో వైసిపి అభ్యర్థిగాపోటీకి దిగుతానని,పవన్ కల్యాణ్ తనపై పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఒకవేళ తాను గెలిస్తే పవన్ కల్యాణ్ తన పార్టీని రద్దు చేసుకోవాలని ఆయన షరతు విధించారు.పవన్ కల్యాణ్ కనుక గెలిస్తే తాను వెంటనే వెంగయ్యనాయుడు ఆత్మ హత్యకేసులో న్యాయ స్థానంముందు లొంగిపోతానని ఆ కేసులో పడే శిక్షను ఎదుర్కొంటానని అన్నా రాంబాబు చెప్పారు.ఉప ఎన్నిక జరిగినా తాను ఒక్కడే జగన్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫొటోలతో ప్రచారం చేసుకుంటానని ముఖ్యమంత్రి కూడా ఉప ఎన్నికల ప్రచారానికి రాడని అన్నారు.తన బహిరంగ సవాల్ కు పవన్ కల్యాణ్ సిద్ధమైతే వెంటనే ఆ విషయాన్ని మీడియా ద్వారా ప్రకటించాలని అన్నా రాంబాబు తాడేపల్లిలోని వైసిపి కార్యాలయంలో లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. అన్నా రాంబాబు దూషించడంతో గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన వెంగయ్యనాయుడు అనే జనసేన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రచారం జరుగుతుండడం,దీనికి స్పందించి సాక్షాత్తూ పవన్ కల్యాణ్ శనివారం ఒంగోలు వచ్చి హల్చల్ చేయడం,అన్నా రాంబాబును అథపాతాళానికి తొక్కేస్తానని అసెంబ్లీ మెట్లు ఎక్కనివ్వబోమని హెచ్చరించటం,ఎస్పీని కలిసి అన్నా రాంబాబు పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం తెలిసిందే.ఈ నేపధ్యంలో రాంబాబు స్పందించి తన కౌంటర్ ఇచ్చారు.పవన్ కల్యాణ్ మీద ఆయన కూడా కౌంటర్ విమర్శలు చేశారు.
ఎవరిని ప్రశ్నించారు? ఏమని ప్రశ్నించారు!
ప్రశ్నించడం తమ పార్టీ నైజమని చెప్తోన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంతవరకూ ఎవరినీ ఏమని ప్రశ్నించారని అన్నా రాంబాబు నిలదీశారు.గతంలో తెలుగుదేశం పార్టీతో చెట్టపట్టాలేసుకు తిరిగిన పవన్ కల్యాణ్ ఏ సందర్భంలోనైనా చంద్రబాబునాయుడిని ప్రశ్నించారా అని అడిగారు.భావ సారూప్యమున్న పార్టీలతో కలుస్తానంటున్న పవన్ కల్యాణ్ మొన్నటి ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీచేశారని, 2014 ఎన్నికల్లో తెలుగుదేశంబీజేపీలకి మద్దతు ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ బీజేపీ పంచన చేరారన్నారు.కమ్యూనిస్టులు బీజేపీలు ఏవిధంగా భావ సారూప్యమున్న పార్టీలో తనకు అర్థం కావడం లేదన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు ఇరవై మూడు మందిని చంద్రబాబునాయుడు టిడిపిలో చేర్చుకుని మంత్రి పదవులిచ్చి నప్పుడు పవన్ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు.అది నచ్చకనే తాను తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చి పార్టీ ఫిరాయింపుల మీద కోర్టులో కేసు వేసి కనీసం వారికి నోటీసులు ఇప్పించడం అయినా చేశానన్నారు.కానీ పవన్ కల్యాణ్ చోద్యం చూశారని రాంబాబు విమర్శించారు.
చేగువేరా అంటాడు ..చేస్తున్నదేమిటి ?
ఇక మాట్లాడితే పవన్ కల్యాణ్ చేగువేరా అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ వంటి వారి పేర్లు చెబుతుంటాడని,వారే తనకు ఆదర్శం అంటుంటాడని..అయితే ఆయన చర్యలు మాత్రం వారికి పూర్తి భిన్నంగా ఉంటాయన్నారు.చాలా పుస్తకాలు చదివాను అంటున్న పవన్ కల్యాణ్ ఏమి చేస్తారో ఎవరికీ అర్థం కాదన్నారు.చెప్పడం కాదని చేసి చూపించాలని అన్నా రాంబాబు జనసేనానికి హితవు పలికారు.పోరాటయోధుడు అంటే జగన్ అని, ఆయన కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ మీద మడమ తిప్పని పోరాటం చేశారని ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆ కృతజ్ఞత ఇప్పటికీ ఉంది!
కాగా తాను తొలిసారిగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మాట వాస్తవమేనని ఆ కృతజ్ఞతల ఇప్పటికీ తనకు ఉందని ఆయన చెప్పారు.తాను ఎన్ని పార్టీలు మారినప్పటికీ మెగాస్టార్ చిరంజీవిని ఎప్పటికీ గుర్తుంచుకుంటానన్నారు.ఇదే విషయాన్ని తాను అసెంబ్లీలో సైతం చెప్పానన్నారు. ఇదే విషయాన్ని గతంలో తాను అసెంబ్లీలో సైతం చెప్పానన్నారు.అయితే రాజకీయ పరంగా మాట తప్పని మడమ తిప్పని జగన్ తనకు నచ్చినందువల్లే ఆయన పార్టీలో చేరానని తెలిపారు.బతికినంత కాలం తాను జగన్ భక్తుడుగానే ఉంటానని రాంబాబు స్పష్టం చేశారు.