(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర రాజకీయాల్లో వైయస్సార్ సిపి పార్టీ తరఫున ఎక్కువ ఆవేశపూరితంగా ఉండే నేతగా, చంద్రబాబు సొంత స్వగ్రామం నారావారిపల్లె కు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అందరికీ తెలిసిన వ్యక్తి. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఆయనకు లభిస్తున్న ప్రోత్సాహంతో రాజకీయాల్లో దూసుకెళ్తున్న నాయకుడిగా పేరు ఉంది. మరోపక్క భూమన కరుణాకర్ రెడ్డి శిష్యుడిగా అందరితో పరిచయం ఉంది. ఇటు తెలంగాణలోనూ కేసీఆర్ కుటుంబంతో ఆయనకు మంచి మిత్రత్వం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే చంద్రగిరి నియోజకవర్గంలో కిందిస్థాయి కార్యకర్తల వరకు వెళ్లి పలకరించి డంలో చెవిరెడ్డి తీరే వేరు. సాధారణ గ్రామస్థాయి కార్యకర్తలు సైతం ఆయనతో కలిసి పోతారు. ఆయన ప్రచారం కోసం కానివ్వండి ఇతర సేవా కార్యక్రమాలు కానివ్వండి అన్ని మీడియాకు హాట్ టాపిక్. తాజాగా నెంబర్ తుఫాను సమయంలో ఆయన చేసిన సాహసం ఇప్పుడు సీఎం కార్యాలయం వరకు వెళ్ళింది. ముఖ్యమంత్రి జగన్ తోనూ ఆయన మెప్పు పొందారు.
ఎం జరిగింది అంటే?
గురువారం చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో చోటుచేసుకుంది. ఏర్పేడు మండలానికి చెందిన ముగ్గురు యువ రైతులు పొలం పనులకు వెళ్ళారు. అయితే నివర్ తుఫాను కారణంగా విపరీతమైన వర్షం కురవడంతో ఆ ప్రాంతంలో నీరు చేరిపోయింది. రైతులు ఇంటికి తిరుగు ముఖం పట్టారు. మార్గమధ్యంలో రాగుళ్ళ వాగుకు నీటి ఉధృతి పెరగడంతో ఆ రైతులు వరదలో చిక్కుకుపోయారు. చెట్లను పట్టుకుని అక్కడే ఉండిపోయారు. నీరు అంతకంతకు పెరిగిపోసాగింది. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చెవిరెడ్డికి సమాచారం చేరింది. విషయం తెలిసిన వెంటనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులను సమన్వయం చేశారు. మరోవైపు తాను సంఘటనా స్థలానికి పరుగులుదీశారు. హెలికాఫ్టర్ ఇక్కడికి చేరుకున్నా వాతావరణం అనుకూలించకపోవడంతో వీలుపడలేదు. దీంతో చెవిరెడ్డి స్థానిక ఫైర్, ఇతర సిబ్బంధిని కూడేశారు. సమీపంలో ఉన్న స్పీడ్ బోటును చెవిరెడ్డి తెప్పించారు. మరోవైపు నీటి ఉధృతి పెరిగిపోతోంది. వరద నీటిని కూడా లెక్క చేయకుండా అందరూ వారిస్తున్నా కూడా వినకుండా తానే ప్రత్యక్షంగా సహాయక చర్యల్లో దిగారు. లైఫ్ జాకెట్ ధరించి సిబ్బందితోపాటు తాను కూడా బోటు ఎక్కి వాగులో చిక్కుకున్న రైతుల రక్షణ చర్యల్లో పాలుపంచుకున్నారు. రైతులను బోటు ద్వారా ఒడ్డుకు చేర్చారు. రైతులకు తానే స్వయంగా నీరు తాపించి వారిని సముదాయించారు. ధైర్యం చెప్పారు. తమ కుటుంబ సభ్యులను కాపాడడానికి ఆయన చూపిన తెగువకు రైతుల కుటుంబాల సభ్యులు చెవిరెడ్డికి కృతజ్నతాపూర్వకంగా పాదాభివందనం చేశారు.
అండగా… దండగా
నేరుగా రంగంలో దిగి బాధితులను కాపాడడానికి కూడా వెనుకాడనని చెవిరెడ్డి మరోమారు నిరూపించారు. ఆయన తెగువను, సేవానిరతిని అక్కడున్న వారు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అయితే మరొక రైతు మాత్రం కాలికి వేర్లు తగులుకుని ఇరుక్కుపోవడంతో వరదల్లో గల్లంతయ్యారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అతని కోసం ఎన్డీయారెఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
చెవిరెడ్డికి సిఎం అభినందన
ఎవరి కోసం ఎదురు చూడకుండా సమాచారం అందిన వెంటనే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి వాగులో వరదల్లో చిక్కకున్న రైతులను సకాలంలో కాపాడడానికి చూపిన తెగువ, సమన్వయానికి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినదించారు. ఇక అదే విధంగా అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు చెవిరెడ్డి చూపిన చొరవను ధైర్యాన్ని మెచ్చుకుని అభినందించారు.