మొన్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసిపి ఎమ్మెల్యే ఉషశ్రీ కి, నిన్న కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ జక్రియాబేగంకు ,నేడు చిలకలూరిపేట వైసిపి ఎమ్మెల్యే
విడుదల రజనీకి టోకరా వేయడానికి ప్రయత్నించిన సైబర్ నేరగాడు రెడ్ హాండెడ్గా పోలీసులకు దొరికిపోయాడు. రజని అత్యంత చాకచక్యంగా ఆ సైబర్ నేరగాడిని పోలీసులకు పట్టించారు.ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే ఈ మహిళా వైసిపి ప్రజా ప్రతినిధులెవరూ సైబర్ నేరగాడి వలకు చిక్కలేదు.ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను టార్గెట్గా చేసుకుని జగజ్జీవన్రాము అనే చీటర్ వారిని ట్రాప్ చేయడానికి ప్రయత్నించాడు.ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లు ఫోన్ చేసి వారిని మోసం చేసే ప్రయత్నాలు సాగించాడు.
ఈ జగజ్జీవన్ రామ్ ఎమ్మెల్యేలు…ఎమ్మెల్సీలకు ప్రత్యేక పథకం ఒక అందుబాటులోకొచ్చిందని, ఇరవై లక్షల రూపాయలు కడితే మూడు కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్సీ జక్రియా,ఎమ్మెల్యే విడుదల రజనీ లను నమ్మించే ప్రయత్నాలు చేశాడు.తాను సీఎంఓ కార్యాలయం నుండి ఫోను చేస్తున్నానని కూడా వారికి చెప్పుకొచ్చాడు.జక్రియా బేగం వెంటనే సీఎం కార్యాలయానికి ఫోన్చేసి ఇది ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్నారు.విడుదల రజనీ ఇంకా ముందుకెళ్లి చాలా తెలివిగా వ్యవహరించి జగ్జీవన్ రామ్ తో ఫోన్లో మాట్లాడుతూనే డీజీపీకి సమాచారం అందించి అతడిని రెడ్హాండెడ్గా పోలీసులకు పట్టించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ కి ఇదేమాదిరి ఫోను చేసింది శ్రీనివాస్ అని చెబుతున్నారు.
ఆ శ్రీనివాస్ వేరా? ఈ జగజ్జీవన్రామే శ్రీనివాస్ పేరుతో ఫోన్చేశాడా అన్నది పోలీసులు విచారిస్తున్నారు.సరే సైబర్ నేరగాడు దొరికిపోయాడు అంతవరకు సంతోషమే కాని వాళ్లు సిఎంఓ కార్యాలయాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవడం అనేది గమనార్హం.శిరోముండనం కేసులో అరెస్టయిన బిగ్ బాస్ సెలబ్రిటీ నూతన నాయుడు కూడా ఆ కేసు నుండి భార్యను బయటపడేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే కీలక అధికారి పివి రమేష్ కుమార్ పేరు ఉపయోగించుకోవటం తెలిసిందే.దాదాపు ముప్పై సందర్భాల్లో నూతన్ నాయుడు తన పేరు ఉపయోగించుకున్నట్లు పివి రమేష్ వాపోయారు.ఇలాంటి సంఘటనల నేపథ్యంలో సీఎంఓ కార్యాలయం కొన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.