Big Breaking: కరోనా వ్యాధిగ్రస్తుల పాలిట సంజీవనిగా పేరు తెచ్చుకున్న కృష్ణపట్నం ఆయుర్వేద ఔషధానికి అధికారుల పరంగా అభ్యంతరాలు ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజాభీష్టానికి తలొగ్గి ఆ మందు పంపిణీకి సిద్దం అయిపోయారు.శుక్రవారం నుండి ఈ మందును తిరిగి పంపిణీ చేయనున్నట్లు వైసిపి జిల్లా అధ్యక్షుడు,సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.వివరాల్లోకి వెళితే ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య వైద్యమూలికలు,తేనె ,మిరియాలు,పచ్చకర్పూరం,జీలకర్ర తదితరాలతో ఈ మందును తయారుచేసి ఉచితంగా ఇస్తున్నాడు.
ఈ మందు తీసుకుంటే కరోనా రాదని, కోవిడ్ వచ్చినవారు తీసుకుంటే అది నయమవుతుందని ఆనందయ్య చెబుతున్నాడు.నెల రోజుల క్రితమే తాను ఈ మందు తయారు చేసి ఇవ్వడం మొదలు పెట్టానని,అది బాగా పనిచేస్తుందని ప్రచారం జరగడంతో ఇప్పుడు ప్రజలు పెద్ద సంఖ్యలో మందు కోసం వస్తున్నారని ఆయన తెలిపారు.ఇప్పటికే ఇరవై వేల మందికి ఈ మందు ఇచ్చినట్టు వెల్లడించారు.ఈ మందును ఆనందయ్య ఉచితంగానే ఇస్తున్నారు.ఆర్థిక స్థోమత ఉన్నవారు మందు తయారీకి అవసరమైన ముడి పదార్థాలను అందజేస్తున్నారు.
మధ్యలో ఏం జరిగిందంటే!
ఏ కారణం చేతనో జిల్లా అధికార యంత్రాంగానికి మాత్రం ఈ మందు పై అనుమానాలు తలెత్తాయి.జిల్లా కలెక్టర్ ఒక ఉన్నతస్థాయి అధికారుల బృందాన్ని ఆ గ్రామానికి పంపారు.వారు క్షేత్ర పరిశీలన చేసి నివేదిక రూపొందించారు.ఆ మందు తీసుకుంటున్న ప్రజలందరూ అది పనిచేస్తోందని చెబుతున్నారని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.ఏ ఒక్కరూ కూడా ఈ మందుకు వ్యతిరేకంగా చెప్పలేదని కూడా తెలిపారు.తమ కళ్లముందే ఒకరిద్దరు రోగులకు ఈ మందు ఇవ్వగా అది ప్రభావం చూపి ఆక్సిజన్ లెవల్స్ పెంచిందని కూడా అధికారులు చెప్పారు.కానీ ఈ మందుకు శాస్త్రీయత ఏమిటి తదితర అంశాలు తేలాల్సి ఉందని,దీన్ని ల్యాబ్లో పరీక్షించాలని అధికారులు కలెక్టర్ కి నివేదించారు.దీంతో కలెక్టర్ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ మందు పంపిణీని నిలిపివేయాలని ఆదేశించారు
పెల్లుబుకిన ప్రజాగ్రహం!
అయితే ఈ మందు పంపిణీని నిలిపివేయడం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకింది.ఖరీదైన మందులు కొనుక్కోలేని పేద కరోన రోగులకు ఈ మందు అందుబాటులో ఉంటే దాన్ని కూడా అధికారులు అడ్డుకోవడం తగదని ప్రజలు బహిరింగంగానే సోషల్ మీడియా వేదికగా చెప్పడం ప్రారంభించారు.దీంతో స్థానిక శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్రెడ్డి సమస్యను పరిష్కరించే బాధ్యతను చేపట్టారు.శుక్రవారం నుండి ఈ మందు పంపిణీకి ఏర్పాట్లు చేశారు.
ఎమ్మెల్యే ఏం చెప్పారంటే!
ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన వస్తువులతో, ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందు పట్ల ఎటువంటి హానీ ఉండ బోదని ఎమ్మెల్యే గోవర్ధన్రెడ్డి స్పష్టంగా ప్రకటించారు.కృష్ణపట్నంలో ఆనందయ్య అందజేస్తున్న మందు వల్ల అనేకమంది కరోనా బారి నుండి బయటపడి, వారి ఆరోగ్యం కుదుటపడిందని కూడా ఎమ్మెల్యే వెల్లడించారు.ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన చెప్పారు.ఈ నేపధ్యంలో కరోనా ఉదృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి, శుక్రవారం నుండి తిరిగి ఈ ఆయుర్వేద మందును పంపిణీ చేయాలని నిర్ణయించామని ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.ఇంకా ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.