తెలంగాణలో ఒక చెరువును కబ్జా చేయడమే కాకుండా అది నా స్థలమంటూ బోర్డ్ పెట్టేసిన కర్నూలు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉదంతం వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే అక్రమ నిర్మాణాలకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.
అడ్డు అదుపు లేకుండా ల్యాండ్ మాఫియా ఏ ప్రాంతాన్ని వదలడం లేదు. కన్నుపడితే చాలు ఎలాంటి భూమినైన కాజేస్తోంది. పటాన్చెరులోని అమీన్పూర్లో చెరువుల భూములు క్రమంగా మాయమైపోతున్నాయి. తమకు కావాల్సిన భూమిని కబ్జా చేసేందుకు కబ్జా రాయుళ్లు తెగిస్తుండగా మరోవైపు ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వాధికారులు, నిబంధనలను యథేచ్ఛగా ల్యాండ్ మాఫియాకు అనుకూలంగా మారుస్తూ.. ఇటు ప్రభుత్వాలను అటు చట్టాలను మోసం చేస్తున్నారని విమర్శలున్నాయి. కుతుబ్ షాహీల కాలంలో రైతుల కోసం పటాన్చెరు ప్రాంతంలో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు ఏర్పడ్డాయి. అమీన్పూర్ చెరువుతో పాటు గొలుసుకట్టు చెరువులు, కుంటలు ఏర్పడ్డాయి. అమీన్పూర్ చెరువు కింద కొత్త చెరువు, బొమ్మనకుట, శెట్టికుంట, శంభుని కుంట, ఉబకుంట, శంబి చెరువు, గండికుంట, పోచమ్మకుంటలు ఉన్నాయి.
ఇలా అమీన్పూర్ పెద్ద చెరువుతో పాటు 12 కుంటలు కుతుబ్షాహీల కాలంలో పురుడుపోసుకున్నాయి. వాటిపై కబ్జాగాళ్ల కన్నుపడటంతో ఇప్పుడవి కనుమరుగయ్యాయి.కాగా అమీన్పూర్ చెరువు కింద ఉన్నటువంటి కొత్త చెరువు నుకూడా కబ్జా చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి కొత్త చెరువు స్థలంలో బోర్డులు పెట్టేశారు. కొత్త చెరువు తనదే అంటూ కాటసాని రాంభూపాల్రెడ్డి పేరుతో కొత్త చెరువులో బోర్డులు వెలిశాయి. అక్కడ కూడా ఎఫ్టీఎఫ్ పరిధి దాటి నిర్మాణాలు జరిగాయని కనిపిస్తోంది.
ఇక పటాన్చెరు నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రదేశంలో సుమారు 100 ఎకరాల్లో ఉండే బొమ్మనుకుంట చెరువును ల్యాండ్ మాఫియా మింగేసింది. వెంచర్లు వేసి అమ్మకాలు చేయడంతో వందలాది ఇళ్లు నిర్మాణం అయ్యాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వెలిశాయి. బొమ్మనుకుంట చెరువుతో ల్యాండ్ మాఫియా పాగా వేయడంతో… పూర్తిగా కబ్జాకు గురైంది.ఇదే విషయమై ఇటీవల ఒక దినపత్రికలో ‘వార్త ‘రాగా పటాన్చెరు ఎమ్మెల్యే సదరు విలేకరి ఇంటికొచ్చి నరికేస్తానని బెదిరించడం కూడా జరిగింది.ఇంకా లోతుగా వెళ్లి వివరాలు సేకరిస్తే ఆ ప్రాంతంలో ఒక చెరువును ఆంధ్రప్రదేశ్ వైసిపి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కబ్జా చేసిన విషయం బహిర్గతమైంది. ఇంకెందరు బడా నేతలు ఈ వ్యవహారం లో ఉన్నారో చూడాలి !