టీడీపీ అధినేత చంద్రబాబు, దివంగత టీడీపీ మాజీ మంత్రి పరిటాల రవీంద్రపై వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్న ముట్టాట, తోపుదుర్తి, దేవరకొండ మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. వెంకటాంపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్, మూడు రిజర్వాయర్ల భూమి పూజ పనులను సీఎం జగన్ తాడేపల్లి నుండి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్సా సత్యనారాయణ, శంకర నారాయణ, సిదిరి అప్పలరాజులతో పాటు పాల్గొన్న ఎంపి గోరంట్ల మాధవ్ కార్యక్రమం పూర్తి అయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పరిటాల రవిపై పరుషమైన వ్యాఖ్యలు చేశారు.
బీసిలకు జడ్జి పదవులు ఇవ్వరాదనీ, జడ్జిలుగా బీసీలు పనికి రారని గతంలో చంద్రబాబు నోట్స్ రాశారని మాధవ్ ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా వ్యవసాయం దండగ అని కూడా అన్నారని గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి దొంగలా అమరావతికి చంద్రబాబు పారిపోయి వచ్చారంటూ మాధవ్ విమర్శించారు.
దివంగత టీడీపీ నేత పరిటాల రవిని రక్తపిపాసిగా అభివర్ణించారు మాధవ్. పరిటాల అరాచకాలకు చంద్రబాబు అండగా నిలిచారని ఆరోపించారు. పరిటాల నక్సలైట్ గా, ఫ్యాక్షనిస్ట్ గా ఎంతో మంది తలలు నరికారని కూడా గోరంట్ల అన్నారు. చంద్రబాబు అండదండలతో ఎమ్మెల్యేగా ఉంటూ పరిటాల కిరాతకాలకు పాల్పడ్డారని ఆరోపించారు మాధవ్. పరిటాల ప్రాతినిధ్యం వహించిన రాప్తాడు నియోజకవర్గంలో పొలాలు నీళ్లు లేక ఎండిపోతుంటే పరిటాల రవి మాత్రం రక్తపుటేర్లతో పొలాలను తడిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు సీఎం వైఎస్ జగన్ అనంతపురం జిల్లాపై ప్రత్యేక శ్రద్దతో నీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం ఆనందించదగిన విషయం అని మాధవ్ పేర్కొన్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలీస్ అధికారిగా ఉన్న గోరంట్ల మాధవ్ నాడు మంత్రి జేసి దివాకరరెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అనంతరం మాధవ్ పోలీస్ అధికారి పదవికి స్వచ్చంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తరువాత వైసీపీ తరపున హిందూపురం ఎంపిగా గోరంట్ల మాధవ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.