(కాకినాడ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటి వరకు రాష్ట్రంలోని వైసీపీ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వస్తున్నది. రాజ్యసభలోనూ వైసీపీ సహకరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్రం మాట తప్పినా ఆ నెపాన్ని చంద్రబాబుపై వేసి మంత్రులు విమర్శిస్తున్నారు కానీ కేంద్రంలోని బీజేపీ పై విమర్శలు చేయలేదు. సీఎం వైఎస్ జగన్ ప్లిజింగ్ గా పీఎం మోడీ కి లేఖ రాశారు కానీ విమర్శనాత్మక ధోరణికి వెళ్ళలేదు. కానీ ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వైసీపీ కీలక నేత పిల్లి సుభాస్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఏ నాయకుడు కూడా ఇటీవల కాలంలో ఇలా మాట్లాడలేదు.
రాష్ట్ర విభజన తరువాత ఏపీ రెవిన్యూ లోటును కేంద్రం పట్టించు కోవడం లేదని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. కాకినాడలో నేడు జరిగిన ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు చేశారు. జీఎస్టీ, పోలవరం నిధులను కేంద్రం ఇవ్వకుండా ఎగనామం పెట్టడం ఏపీకి తీరని నష్టమని అన్నారు. కరోనా కారణం చూపి మీ పాట్లు మీరు పడండి అని కేంద్రం ఉచిత సలహా ఇస్తే ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. చిన్న రాష్ట్రాలను ఆర్ధికంగా నిర్వీర్యం చేస్తే ఆశించిన ప్రయోజనాలు రావని పేర్కొన్నారు. రాష్ట్రాల ప్రయోజనాలు రక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు సుభాష్ చంద్రబోస్. ఆంధ్రప్రదేశ్ ఆరేళ్ళ చిన్న బాలుడు లాంటిదని, ఎవరైనా బాలుడు (రాష్ట్రం)ని చూసి అప్పు ఇవ్వరని, తండ్రి (కేంద్రం)ని చూసే ఎవరైనా అప్పు ఇస్తారని సుభాష్ చంద్రబోస్ అన్నారు.