అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సోమవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలు ఆరోపణలతో వరుస ట్వీట్లను సంధిస్తూ విమర్శలు చేశారు.
మనీలాండరింగ్ దళారి సానా సతీశ్తో చంద్రబాబు, ఆయన పార్టీ ప్రముఖుల సంబంధాల పైనా కేంద్రం దర్యాప్తుకు ఆదేశించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.‘ చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తి అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసే పెట్టే స్థాయికి ఎదగడం వెనక ఉన్నది చంద్రబాబే అని అందరికీ తెలుసు’ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
‘కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ? అమరావతి కలల రాజధానో, కులపు రాజధానో తెలుస్తుంది. ఇన్సైడర్ ట్రేడింగుతో అమాయక రైతుల పొట్టకొట్టి మీరూ, మీ బినామీలు లాగేసుకున్న వేల ఎకరాల స్టోరీలన్నీ సీరియల్గా బయటకొస్తాయి. మీరు నిప్పులో తుప్పులో ప్రజలే చెబుతారు. కాండ్రించి ఉమ్ముతారు.’ అని దుయ్యబట్టారు.
రోమ్ నగరం తగలడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తిని చంద్రబాబు మరపించారని విజయసాయిరెడ్డి విమర్శించారు. నీటి కొరత, రోగాలు, కరువు, తుఫాన్లతో ఇక్కడ ప్రజలు విలవిల్లాడుతుంటే దావోస్ సదస్సులో పాల్గొనేందుకు ఐదేళ్లలో వంద కోట్లకు పైగా తగలేశారని విజయసాయిరెడ్డి అన్నారు. కానీ ఆయన పర్యటనల వల్ల ఒరిగింది శూన్యం. ఒక్క పరిశ్రమ రాలేదని విజయసాయిరెడ్డి విమర్శించారు.
పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చంద్రబాబు దావోస్లో ఏపీ లాంజ్ కోసం 17 కోట్ల రూపాయలు మంచి నీళ్లలా ఖర్చు చేయడంపై దర్యాప్తు జరగాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. నాలుగు రోజుల భోజనాలకు 1.05 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారో తేలాలనీ విజయసాయిరెడ్డి అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?