(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: బడ్జెట్ నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండిచేయి ఇచ్చిందని, ఈ విషయమై పార్లమెంట్ లో పోరాడతామని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరతామన్నారు. ఈ బడ్జెట్ తీవ్ర నిరుత్సాహపరిచిందని చెప్పారు. ఏపీకి ఒక్క కొత్త రైల్వే ప్రాజెక్ట్ కూడా ప్రకటించలేదనీ, రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల అభివృద్ధికి నిదులు ఇవ్వలేదనీ, రాష్ట్రానికి ప్రత్యేకహోదా గురించి ప్రస్తావించలేదనీ, పారిశ్రామిక రాయితీలు, సబ్సిడీల ఊసే లేదనీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు.
ఏపీ విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటు కింద నిధులు రావాలనీ, ప్రాజెక్టుల కేటాయింపులో పోలవరం ప్రాజెక్టు కూడా చేర్చాలనీ డిమాండ్ చేశారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తారనే విషయమై స్పష్టత లేదన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని కోరారు. కేంద్రానికి పక్షపాత ధోరణి మంచిది కాదని విజయసాయి హితవు పలికారు.