అమరావతి: చంద్రబాబు, ఆయన శిష్య గణం రిటైర్మెంట్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్నారనీ అందుకే ప్రతిదీ నెగిటివ్గా కనిపిస్తోందని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లపై విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తూ ట్వీట్లు వదిలారు.
‘చంద్రబాబు, ఆయన శిష్య గణానికి ప్రతిదీ నెగెటివ్గా కనిపించడానికి ‘రిటైర్మెంట్ సిండ్రోమ్’ కారణం. పదవులు పోవడం, ప్రజలు పట్టించుకోకపోవడం, మొన్నటి వరకు ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించిన వారంతా అదృశ్యమవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉంటుంది. బయట పడటం అంత తేలికేమీ కాదు.’ అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
‘చిత్తుగా ఓడి కూడా ‘హింసించే రాజు 23వ పులకేశి’ లాగా లోకేశ్ ప్రజలను టార్చర్ చేస్తున్నాడు. ఎన్నికలప్పుడు చేసిన చవకబారు విమర్శలనే మళ్లీ వదులుతున్నాడు. చంద్రబాబు కొడుకు కాబట్టి దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి మంత్రిగా మూడు శాఖలను భ్రష్టు పట్టించాడు. కీచురాళ్ల రొద లాగా ఏదేదో ట్వీటుతున్నాడు.’ అంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు.