అమరావతి: అమరావతి ఒక స్కాముల పుట్ట అని గుర్తించే ప్రపంచ బ్యాంకు 3500కోట్ల రూపాయల రుణాన్ని నిలిపివేసిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.ప్రపంచ బ్యాంకు రుణం నిలిపివేయడంపై ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.
కేంద్రం సూచనలతోనే అమరావతికి రుణ ప్రతిపాదనను విరమించుకున్నామని ప్రపంచ బ్యాంకు వెల్లడించినా విజయసాయిరెడ్డి మాత్రం టిడిపి ప్రభుత్వ నిర్వాకం వల్లనే వారు వెనక్కు వెళ్లినట్లు పేర్కొంటూ విమర్శ చేశారు.
రియల్ ఎస్టేట్కు మేలు చేసేదిగా ఉండటం, రుణం ఇవ్వకుండానే 92 కిలో మీటర్ల రోడ్డుకు 1872 కోట్ల రూపాయల అంచనాలతో టెండర్లు ఆమోదించడం అతి పెద్ద కుంభకోణంగా బ్యాంకు దర్యాప్తులో వెల్లడైందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
మరో ట్వీట్లో నారా లోకేష్కు ‘అభిజ్ఞా పక్షపాతం’ వ్యాధి వచ్చినట్లుగా ఉందని విజయసాయిరెడ్డి విమర్శించారు.
‘తామే సర్వజ్ఞానులమనీ, అన్యులంతా అజ్ఞానులని భావించే వారు కాగ్నిటివ్ బయాస్ (అభిజ్ఞా పక్షపాతం)తో ఉంటారని సైకాలజీ చెబుతోంది. దీనిని డన్నింగ్ క్రుగర్ ఎఫెక్ట్ అని కూడా పిలుస్తారు’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. లోకేష్ సమస్య కూడా ఇదేననీ, తండ్రి చాలా కాలం అధికారంలో ఉండటం, ఒక్కడే సంతానం కావడం వల్ల ఈ వ్యాధికి లోనై ఉండవచ్చని విజయసాయి రెడ్డి విమర్శించారు.