అమరావతి: రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులను సమాచార కమిషనర్లుగా నియమించడం తగదని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విజయవాడకు చెందిన హోటల్ యజమాని ఐలాపురం రాజా, విద్యాశాఖ మంత్రికి ప్రైవేటు సెక్రటరీగా ఉన్న శ్రీరాంమూర్తిలను సమాచార కమిషనర్లుగా నియమించడంపై తమ పార్టీ అభ్యంతరం తెలుపుతుందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్వి సుబ్రమణ్యంకు శుక్రవారం విజయసాయ రెడ్డి లేఖ రాశారు.
ఐలాపురం రాజా, శ్రీరాంమూర్తిలు తెలుగుదేశం పార్టీకి చెందిన వారని విజయసాయి రెడ్డిలో లేఖలో పేర్కొన్నారు.
సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 15 ప్రకారం సమాచార కమిషనర్ల నియామకాలు చేపట్టాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
2017లో తెలంగాణలో రాజకీయ పార్టీలకు చెందిన ఆరుగురిని సమాచార కమిషనర్లుగా నియమించడంతో ఆ నియామకాలను సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయాన్ని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.