దేశంలో వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో డ్రోన్ పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్న దృష్ట్యా డ్రోన్ టెక్నెలజీపై మరింత విస్తృత పరిశోధనలు జరిపేందుకు ఏపిలోని విశాఖపట్నంలో జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కోరారు. ఈ అంశంపై రాజ్యసభలో సోమవారం జీరో అవర్లో విజయసాయిరెడ్డి మాట్లాడారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో ఆవిష్కృతమైన అత్యంత కీలక సాంకేతిక పరిజ్ఞానాలలో డ్రోన్ టెక్నాలజీ ఒకటని ఆయన పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యవసాయం, రక్షణ, రవాణా రంగాలతో పాటు అనేక రంగాలలో డ్రోన్ల వినియోగం బాగా పెరిగిందన్నారు.
డ్రోన్ టెక్నాలజీ వినియోగంలో దేశం ముందంజలో ఉందని విజయసాయి గుర్తు చేశారు. దీనిని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగంలో క్రిమి సంహారక మందులు చల్లేందుకు, పొలాల్లో తేమ శాతాన్ని పర్యవేక్షించేందుకు, పంట ఎదుగుదలో వివిధ దశలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ సాయంతో తక్కువ శ్రమతో రైతులు పంట దిగుబడులను 15 శాతం వరకు పెంచే అవకాశం ఉందని విజయసాయి రెడ్డి అన్నారు.
ఏపిలో 65 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని విజయసాయి చెప్పారు. వ్యవసాయ రంగంలో కొత్త పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సాగులో ప్రయోగాలకు రాష్ట్ర రైతాంగం ఎప్పుడూ ముందుంటారని తెలిపారు, ఏపిలో రైతులు క్రమేణా ఆయిల్ పామ్ సాగు వైపు కూడా మళ్ళుతున్నారని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయమైన పురోగతి సాధించడం ద్వారా రైతులు దేశ ప్రగతికి తోడ్పడుతున్నందున వారికి ఎంతగానో ఉపకరించే డ్రోన్ల పరిజ్ఞానాన్ని మరింత విస్తృతపరచేందుకు విశాఖపట్నంలో జాతీయ డ్రోన్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?