అమరావతి: వైసిపి సోషల్ మీడియా వాలంటీర్లపై గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తామని ఆ పార్టీ ఎంపి వి విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసిపి సోషల్ మీడియా వాలంటీర్ల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైసిపి విజయంలో సోషల్ మీడియా వాలంటీర్ల కృషి మరువలేనిదని అన్నారు. వాలంటీర్ల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందని ఆయన అన్నారు. అవినీతి రహిత పాలనకు సిఎం జగన్ చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. సోషల్ మీడియా వాలంటీర్లపై చంద్రబాబు ప్రభుత్వంలో పెట్టిన కేసులను ఎత్తివేస్తామనీ, భయపడాల్సిన పని లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.