ఈ ఏడాది మార్చి నెలలో టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం ఆ తరువాత మద్దాలి గిరిధర్, ఇటీవల వాసుపల్లి గణేష్ లు వైసీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి నేడు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారు అవుతారు? ఆ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నట్లా? లేక టీడీపిలో ఉన్నట్లా? విజయసాయిరెడ్డి గారే చెప్పాలి.
ఈ నెల మూడవ తేదీన విశాఖకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరనున్నారని వార్తలు హాల్ చల్ చేస్తున్న నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే వైసీపీలోకి చేరడానికి అవకాశం ఉంటుందన్నారు.
తమ పార్టీకి ఒక సిద్ధాంతం అనేది ఉంది, వ్యక్తుల కోసం పార్టీ సిద్ధాంతం మార్చుకోలేమని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలన మెచ్చి చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీ చేరడానికి ఆశక్తి చూపిస్తున్నారని అన్నారు విజయసాయిరెడ్డి. కొన్ని ప్రతిపాదనలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిశీలనలో ఉన్నాయనీ, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని ఆయన తీసుకుంటారనీ తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ వైసీపీకి అనుకూలంగా మారిపోయారు కానీ పార్టీ కండువాలు కప్పుకోలేదు. పార్టీ ఫిరాయింపుల చట్టం నుండి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడగా వారి కుటుంబ సభ్యులను వైసీపీలో అధికారికంగా చేర్చారు.
అయితే ఇతర టీడీపీ ఎమ్మెల్యేల మాదిరిగా గంటా శ్రీనివాసరావు పార్టీలో చేరనున్నట్లు గానీ చేరనట్లు గానీ విజయసాయి రెడ్డి కామెంట్స్ చేయలేదు. దీంతో రేపు గంటా చేరిక ఉన్నట్లా? లేనట్లా? అనేది తెలియాలంటే మరో 24 గంటలు ఆగాల్సిందే.