అమరావతి: చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకూ తెలియదని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఎల్లో మీడియా కూడా యూరప్ నుండి ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని రాసిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. యూరప్ అనేది దేశం కాదనీ, 40దేశాలున్న ఖండమని అందరికి తెలుసునని విజయసాయిరెడ్డి అన్నారు.
ట్విట్టర్ వేదికగా నేడు విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తూ, సొంత నిధులతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టునూ మూడేళ్లలో పూర్తి చేసిందనీ, 45లక్షల ఎకరాలకు నీరందుతుందని పేర్కొన్నారు. కేంద్రం నిధులిచ్చినా ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సగం కూడా నిర్మించలేకపోయారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఎంత సేపు నిధులను దోచుకోవడం తప్ప పూర్తి చేయాలన్న సంకల్పమే ఆయనకు లేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు.