వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెండో పర్యాయం రాజ్యసభ సభ్యుడుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు నూతనంగా ఎన్నికైన పలువురు రాజ్యసభ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. ఏపి నుండి తనను మరో సారి రాజ్యసభ సభ్యుడిని చేసిన సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతమ్మలకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విజయసాయి ట్వీట్ చేశారు. ఇకపై తన బాధ్యతలను మరింత అంకితభావంతో నిర్వర్తిస్తానని తెలియజేస్తున్నానన్నారు.
కాగా పునఃవ్యవస్థీకరించిన రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ లో తనకు అవకాశం దక్కడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి, రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పునఃవ్యవస్థీకరించారు. తనతో పాటు ప్యానల్ లో చోటు దక్కించుకున్న ఇతర సభ్యులకు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్లో విజయసాయిరెడ్డితో పాటు భుభనేశ్వర్ కల్లిటా, తిరుచి సిల్వా, సస్మిత్ పాత్రా, డాక్టర్ ఎల్ హనుమంతయ్య, ఇందు బాలా గోస్వామి సభ్యులుగా అవకాశం దక్కించుకున్నారు.
మరో పక్క రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో వైసీపీ సభ్యులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటు వేయడం జరిగిందనీ, ఈ ఎన్నిక ద్వారా తొలి సారిగా ఒక ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతి కాబోతున్నారని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.