టీడీపీ, దాని అనుకూల మీడియాపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. విశాఖకు పరిపాలనా రాజధాని రాకూడదని కొందరు కుట్రలు చేస్తున్నారనీ, ఆ క్రమంలోనే ఈనాడు సహా ఆ కుల మీడియాలో తప్పుడు, అవాస్థవ కథనాలు ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం విశాఖలో మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి ఇటీవల ఈనాడులో వచ్చిన కథనాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. రామో(జీ) అన్నమే తింటున్నారా అని ప్రశ్నించారు. గతంలో చెప్పాను, ఇప్పుడు చెబుతున్నా విశాఖ సీతమ్మధారలో తనకు ఒక ప్లాట్ మాత్రమే ఉందని అన్నారు. కుమార్తె, అల్లుడు సంస్థలు కొనుగోలు చేసిన ఆస్తులు తనకు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. తన అల్లుడుకు చెందిన ఫార్మకంపెనీలో దేశంలోనే టాప్ ఫై లో ఉందనీ, వారికి నూరు దేశాల్లో ఆఫీసులు ఉన్నాయన్నారు. భాగస్వాములను ముంచి పైకి వచ్చిన ఫ్యామిలీ వాళ్లది కాదనీ, అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. వివాహం అయిన కుమార్తె ఆస్తులు తండ్రికి సంబంధం ఉండదు అన్న కనీస పరిజ్ఞానం కూడా లేకుండా రాతలు రాస్తున్నారంటే ఏమనాలని అన్నారు.
ఉత్తరాంధ్రకు పరిపాలనా రాజధాని రాకూడదు అన్న కుట్రతోనే చంద్రబాబు, ఆయన కులమీడియా విషం చిమ్ముతుందని విమర్శించారు. విశాఖలో భూములు కుంభకోణం అంటూ పతాక శీర్ధికల్లో తెలుగు దేశం పార్టీ కుల పత్రికలు, ఛానళ్లు ప్రసారం చేశాయని దుయ్యబట్టారు. ఇప్పటికే దసపల్లా భూములకు సంబంధించి ప్లాట్ ల యజమానులు, బిల్డర్ లు వివరణ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు కూడా ఈ భూములు ప్రైవేటు వ్యక్తులకు చెందినవేనని చెప్పిందనీ, కోర్టు ఆదేశాలనే ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. ప్రభుత్వం చర్యలతో 400 కుుటుంబాలు లబ్దిపొందాయన్నారు. అక్కడ ఇళ్లు కట్టుకుని ఉన్నవారికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు. 64 మంది ప్లాట్ల ఓనర్లలో 54 మంది ఒక సామాజిక వర్గానికి చెందిన వారని అన్నారు.
ఉత్తరాంధ్రలో కాపులు, యాదవ, ఇతర బీసీ వర్గాలు ఎక్కువగా ఉంటే విశాఖలో ఆస్తులు మాత్రం 75 శాతంపైగా చంద్రబాబు సామాజికవర్గం వారివేనని పేర్కొన్నారు. తాను ఆస్తులపై సీబీఐ, ఈడీ విచారణకు సిద్దమనీ, రామోజీ, చంద్రబాబు సిద్దమేనా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. విచారణ జరిగితే ఎవరు జైలుకు వెళతారో తెలుస్తుందని అన్నారు. మీడియా రంగంలోకి తాను వస్తున్నా, చూసుకుందాం అంటూ రామోజీకి సవాల్ విసిరారు విజయసాయిరెడ్డి.
Breaking: సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్