YS Viveka Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా ( వివేకానంద రెడ్డి) హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా దర్యాప్తు మందకొడిగా సాగుతుండగా, ఈ కేసు తెలంగాణకు బదిలీ అయిన తర్వాత సీబీఐ దూకుడు పెంచింది. చాలా రోజుల తర్వాత సీబీఐ అధికారులు నిన్న పులివెందుల చేరుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద, ఇంటి వద్ద వైఎస్ భాస్కరరెడ్డి కోసం సీబీఐ అధికారులు వాకబు చేశారు. ఇదే క్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.
సీబీఐ అధికారుల ఆదేశాల మేరకు ఇవేళ (మంగళవారం) 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం అవినాష్ రెడ్డి హజరు కావాల్సి ఉంది. అయితే ఈ అంశంపై అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. సీబీఐ విచారణకు పూర్తి గా సహకరిస్తానని పేర్కొన్న అవినాష్ రెడ్డి.. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల మంగళవారం విచారణకు హజరు కాలేనని చెప్పారు. అయిదు రోజుల వరకూ విచారణకు హజరుకాలేనని పేర్కొన్నారు. అయిదు రోజుల తర్వాత ఎప్పుడు విచారణకు పిలిచినా హజరు అవుతానని తెలిపారు. అవినాష్ రెడ్డి విజ్ఞప్తిని సీబీఐ అధికారులు సమ్మతిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినతి మేరకు విచారణ తేదీలను మార్పు చేసిన అధికారులు.. అవినాష్ రెడ్డి విషయంలోనూ సమయం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధి (ఎంపి) కావడంతో సీబీఐ అధికారులు ఆయన విజ్ఞప్తిని కన్సిడర్ చేస్తారని భావిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 మార్చి 15న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆయన నివాసంలోనే దారుణ హత్యకు గురైయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా భావిస్తున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ విచారణ జరుపుతున్నా వివేకా హత్య కేసులో పురోగతి లేకపోవడం, హత్య కేసులో సూత్రధారులను అరెస్టు చేయకపోవడంతో ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత పలు మార్లు సీబీఐ అధికారులను కలవడం, మీడియా ముందు మాట్లాడటం కూడా జరిగింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ కేసు తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయిన తర్వాత ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఏపిలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు