వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు తన ఫందాలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా బుధవారం మీడియా సమావేశంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపైనా, అమరావతి రైతుల పట్ల మంత్రుల చేసిన వ్యాఖ్యలపైనా, ఇంగ్లీషు మీడియంపై సుప్రీం చేసిన వ్యాఖ్యలపైనా, ప్రత్యేక హోదా తదితర అంశాలను ప్రస్థావిస్తూ తన దైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు.
నవంబర్ దాకా ఈ ప్రచారం
వైసీపీని ఎన్డీఎలో చేరమని ఎవరూ అడగడం లేదని, తమ పార్టీ వారే ఉత్తుత్తి ప్రచారం చేసుకుంటున్నారనీ అన్నారు. ఎన్డీఎలోకి వైసీపీని చేర్చుకోవాల్సిన అవసరం లేదనీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆలయాలను కూల్చివేసే పార్టీని ఆలయాలు నిర్మించే పార్టీ కలుపుకుంటుందా అని ప్రశ్నించారు రఘురామ కృష్ణంరాజు. ఎవరితోనూ జట్టు కట్టే ఉద్దేశం లేదని బిజెపి స్పష్టంగా చెప్పిందన్నారు. నవంబర్లో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణ వరకూ ఇలాగే ఎవరికి వారు ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు.
నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తేనే ఆయన కల నెరవేరుతుంది
జగన్ చెబుతున్నట్లు 20 ఏళ్లు అధికారంలో ఉండాలంటే నిర్మాణాత్మకంగా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికారు రఘురామకృష్ణంరాజు. అమరావతి రైతుల పట్ల వైసీపీ నేతలు హేళనగా మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. రైతుల టీషర్టుల గురించి మంత్రులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వ్యవసాయం చేసే వాళ్లు బట్టలు లేకుండా తిరగాలనా మీ ఉద్దేశం అని ప్రశ్నించారు. వారి సొంత ఖర్చులతో విమానంలో ఢిల్లీ వచ్చి పోరాడుతుంటే వాళ్ళను చూసి కుళ్లుకోవడం ఎందుకని అన్నారు. మీరు ప్రత్యేక విమానాల్లో తిరిగితే తప్పులేదు కానీ రైతులు విమానాల్లో తిరిగితే తప్పా అని ప్రశ్నించారు. ఇలాంటై దుర్మార్గమైన తీరుకు ప్రజలే సమాధానం చెప్తారనీ అన్నారు. ఇదే విధంగా రైతుల పట్ల అమర్యాదగా ఎవరు మాట్లాడినా నాలుక చీరేస్తారంటూ హెచ్చరించారు రఘురామ కృష్ణంరాజు. తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పిల్లలు అందరూ ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటే తనలా వృద్ధిలోకి వస్తారని భావించి ఉండవచ్చు కానీ మాతృభాషలో చదువుకున్న నరేంద్ర మోడీ పిఎం అయ్యారని అన్నారు. ఇంగ్లీషు మాధ్యమంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక రకంగా వ్యాఖ్యలు చేస్తే దాన్ని పక్కన పక్కన పెట్టి తెలుగువారి మనసాక్షిలో మరో విధంగా రాశారన్నారు. నచ్చిన మీడియంలో చదువుకునే స్వేచ్చ రాజ్యాంగం ఇచ్చిందనీ అదికారం ఉంది కదా అని రాజ్యాంగాన్ని కూడా మారుస్తామంటే కుదరదని అన్నారు.
హోదాపై చిత్తశుద్ది ఉంటే ఎంపిలు రాజీనామా చేయాలి
సీఎం జగన్కు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉందా ప్రశ్నించారు రఘురామ కృష్ణంరాజు. ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నట్లు కట్టుకథలు అల్లుతున్నారన్నారు. ప్రత్యేక హోదా కావాలంటే కేబినెట్ నుండి బయటకు రావాలని అప్పట్లో టీడీపీని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ హోదాపై చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపిలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వారితో పాటు తాను కూడా చేస్తానని తెలిపారు రఘురామ కృష్ణంరాజు.