అమరావతి: గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో గురువారం అధికార, ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా పర్యటించారు, పోలవరం ప్రాంతంలో నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పర్యటించారు.
ఎమ్మెల్సీ నారా లోకేష్, మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ఆధ్వర్యంలో టిడిపి నేతల బృందం దేవీపట్నం మండలంలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో వీరు లాంచీలో ప్రయాణించారు. వరద బాధితులను పరామర్శించారు.
మరో పక్క జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. గోదావరి పరివాహక గ్రామాల్లో ఇంకా వరద నీరు ఉండటంతో ఆయన పడవలో వెళ్లి బాధితులను పరామర్శించారు. వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని నేతలు విజ్ఞప్తి చేశారు.