YCP Vs BJP: 151 మంది ఎమ్మెల్యేలు, 156 లక్షల ఓట్లు, 22 మంది ఎంపీలు వీటన్నింటికీ మించి విపరీతమైన సానుభూతి, ప్రజాబలం ఉన్న ఏపిలోని వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయడం కేంద్ర ప్రభుత్వం వల్ల సాధ్యపడుతుందా? ఆ సాహసం చేయాల్సిన అవసరం కేంద్రంలోని బీజేపీకి ఉందా ? అంటే ఎవరైనా లేదనే సమాధానం చెబుతారు. అయితే మంత్రి పేర్ని నాని ఎందుకు ఆ విధంగా కామెంట్స్ చేశారు? అలా సంచలన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాష్ట్రంలోని జగన్ సర్కార్ ను కూలదోసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందంటూ మంత్రి పేర్ని నాని ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. అయితే ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ ప్లాన్ లో భాగమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
సంకీర్ణ ప్రభుత్వాలను అయితే ఏదో విధంగా కూలదోసి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి గానీ అసెంబ్లీలో మాజిక్ ఫిగర్ ను దాటి ఎన్నో రెట్లు మెజార్టీ ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని టచ్ చేసే అవకాశమే లేదు. ఇది అసాధ్యం కూడానూ. ఒక వేళ ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ అనుకుంటే ఆ పార్టీ రాజకీయ శత్రువులు అయిన మమతా బెనర్జీపైనో, లేక అరవింద్ కేజ్రీవాల్ పైనో అవకాశం వస్తే వేటు వేయడానికి చూస్తుందే తప్ప కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరమైన సందర్భంలో సహకారం అందిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసే ఆలోచనే బీజేపీ చేయదు. ఎన్డీఏలో వైసీపీ భాగస్వామ్య పక్షం కాకపోయినా పరస్పర సహకారంతోనే ముందుకు సాగుతున్నాయి. గడచిన ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించడానికి పీకే (ప్రశాంత్ కిషోర్) రాజకీయ వ్యూహాలు ఒక కారణం అయితే చంద్రబాబును దెబ్బతీసేందుకు కేంద్రంలోని బీజేపీ పరోక్ష సహాకారం అందించడం మరోక కారణం అని అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు బీజేపీపై వైసీపీ ఎందుకు అభాండాలు వేస్తుంది అంటే.. ఓ పక్క సానుభూతి పొందడం కోసం, మరో పక్క రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల నుండి దృష్టి మళ్లించడం కోసం. ఏపిలో తొలి నుండి డైవర్షన్ పాలిటిక్స్ కు డిమాండ్ ఉంది. ఓ కొత్త అంశాన్ని తెరపైకి తెస్తే పాత అంశం తెరమరుగు అవుతుంది. ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న వివాదాలు తెరమరుగు కావాలంటే కొత్త అంశాన్ని లేవనెత్తాలి, దానిపై చర్చ జరిగేలా చేయాలి. అప్పుడు ఉన్న సమస్య తెరమరుగు అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపం కారణంగా తలెత్తుతున్న సమస్యలపై తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శలు రావడం, మరో పక్క మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకోవడం, అదే విధంగా ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసుల నమోదు, అరెస్టులు తదితర కారణాల వల్ల ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో సానుభూతి కోసం డైవర్షన్ పాలిటిక్స్ గేమ్ ప్లాన్ ను వైసీపీ షురూ చేసిందనే మాట వినబడుతోంది. పేర్ని నాని వ్యాఖ్యలు పూర్తిగా నమ్మశక్యం కాని వనేది సుస్పష్టం.