హైదరాబాదు, ఫిబ్రవరి 23: జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసిపి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు.
శనివారం ఆయన మిడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలోనే కాదు, అమరావతిలో కూడా చక్రం తిప్పలేరని కెటిఆర్ ఎద్దేవా చేశారు.
నూరు శాతం చంద్రబాబు పార్టీ ఓడిపోవడం ఖాయమని కెటిఆర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తే చంద్రబాబుకు ఇబ్బంది ఏమిటని కెటిఆర్ ప్రశ్నించారు.
కేంద్రంలో కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలకు పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదని కెటిఆర్ అన్నారు. తెలంగాణలో 16 పార్లమెంట్ స్థానాలు టిఆర్ఎస్ కైవశం చేసుకుంటుందని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలను గెలుస్తామని, పోటీ చేయాలా వద్దా అనేది కాంగ్రెస్ తేల్చుకోవాలని కెటిఆర్ అన్నారు.