ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉన్నారు.
ఈ సమయంలో అవకతవకల నేపథ్యంలో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జూన్-12న అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఆయన బెయిల్పై విడుదల అయ్యారు అయితే, ఈ వివాదం తాజాగా కొత్త మలుపు తీసుకున్నట్లు సమాచారం.
ఏసీబీ ఏం చెప్పింది?
ఈఎస్ఐలో వైద్య పరికరాలు, మందుల కొనుగోలు కుంభకోణంలో డీలర్ల నుంచి టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మంత్రి అచ్చెన్నాయుడికి డబ్బులు చేరాయనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు జరగడం, బెయిల్ దక్కిన ఎపిసోడ్ ఆసక్తిని రేకెత్తించింది. ఈఎస్ఐలో వైద్య పరికరాలు, మందుల కొనుగోలు కుంభకోణంలో డీలర్ల నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి డబ్బులు చేరినట్లు తమ దర్యాప్తులో ఎక్కడా బయట పడలేదని ఏసీబీ ఇప్పటికే వెల్లడించింది. ఆర్థికపరమైన లావాదేవీలపై ఆధారాలు లభించలేదని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ పేర్కొన్నారు.
ఇక్కడే అసలు సమస్య
‘మంత్రి వద్దకు పలు కంపెనీలు వస్తుంటాయి.. అధికారులకు సిఫారసు చేయవచ్చు, పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ ఒప్పందం చేసుకోవాలంటూ అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.. టెండర్కు వెళ్లాల్సిన వాటిని ఇలా చేయకూడదు.. అందుకు ఆయనతో పాటు ఈఎస్ఐ డైరెక్టర్ రమేశ్కుమార్ను కూడా అరెస్టు చేశాం’ అని చెప్పారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడి పాత్రపైనా ఆధారాలున్నాయని తెలిపారు. 2016-19 మధ్య కాలంలో ఈఎస్ఐకి సబంధించి వైద్య పరికరాలు, మందులు, టెలి మెడిసిన్ సేవలు తదితరాలపై ఈ-టెండర్లు నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా రూ.975 కోట్ల విలువైన కొనుగోళ్లు చేపట్టారని చెప్పారు. ప్రభుత్వ ధనం సుమారు రూ.150 కోట్లు దుర్వినియోగమైందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, దర్యాప్తునకు అందుబాటులో ఉండాలని కోర్టు షరతులు విధించింది.
బాబు పరామర్శ తర్వాత…
దాదాపు 80 రోజులు పాటు రిమాండ్లో ఉన్న అచ్చెన్నాయుడు కరోనా పాజిటివ్ నుంచి కూడా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. దీంతో అచ్చెన్నాయుడు ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడును చంద్రబాబు పరామర్శించారు. అచ్చెన్నాయుడి కేసు విషయంలో అధికారులు సీరియస్గా వ్యవహరించలేదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏసీబీ అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేసింది.