మొన్న చెన్నైలో మరణించిన తల్లి మృతదేహాన్ని ఎదురుగా పెట్టుకుని ఆమె పిల్లలు ఇరవై అయిదు రోజుల పాటు పూజలు చేయడం తెలిసిందే.అలా చేస్తే ఆ తల్లి బతికివస్తుందని ఆ పిల్లల ఆశ.. నమ్మకం! చివరకు విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు రంగప్రవేశం చేసి ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం విదితమే.
కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది .తల్లి చనిపోయినా ఆమె అంత్యక్రియలు నిర్వహించకుండా, నిద్రపోతోందని అంటూ అయిదురోజులుగా అదే ఇంట్లో నివసిస్తున్న కొడుకు కధ పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపుతోంది.
జంగారెడ్డి గూడెంలో జరిగిందేమిటంటే!
జిల్లాలోని జంగారెడ్డి గూడెం మేఘన అపార్ట్ మెంట్ లో రవీంద్ర అనే వ్యక్తి తన తల్లి మంజూలా దేవితో నివసిస్తున్నాడు. కొద్దిరోజులుగా అతని ఫ్లాట్ నుంచి దుర్వాసన రావటంతో చుట్టు పక్కల ఫ్లాట్ల వాళ్లు ఆశా వర్కర్లకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి తలుపు కొట్టగా రవీంద్ర వారిని చూసి తలుపు తీశాడు.తలుపు తీయగానే దుర్వాసన రావటంతో పరిస్ధితి గ్రహించిన ఆశావర్కర్లు తల్లి మంజులా దేవి మరణించిందని చెప్పారు. ఆ మాట ఒప్పుకోకుండా తన తల్లి నిద్రపోతోందని… డిస్టర్బ్ చెయ్యవద్దంటూ వారిని పంపించివేశాడు. ఆశా వర్కర్లు ఎంత చెప్పినా వినకపోవటంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దగిన పోలీసులు మృతదేహాన్ని స్మశానానికి తరలించారు.
రవీంద్రకి ఇది కొత్త కాదట
కాగా రవీంద్ర మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని ఉండటం ఇవాళ కొత్తేమి కాదని స్ధానికులు తెలిపారు. రెండేళ్ల క్రితం అతని చెల్లెలు చనిపోయినప్పుడు కూడా ఇలాగే ప్రవర్తించాడని వివరించారు. రవీంద్రకు మతి స్థిమితం లేదని దీంతో ఆమె తల్లి మరణించినా నిద్రపోతుందనే భావనలో ఎవరికీ చెప్పకుండా అక్కడే ఉంటున్నాడని చెబుతున్నారు స్థానికులు. ఆమె మరణించి అయిదురోజులు అయి ఉంటుందని భావిస్తున్నారు.ఇంత కంప్యూటర్ యుగంలో కూడా మూఢ నమ్మకాలకు కాలం చెల్లకపోవటం అనేది విచిత్రం.