(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
విశాఖ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని అశ్విని లాడ్జిలో ఒకే కుటుంబానికి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పెందుర్తి మండలం బందపువారిపాలెం గ్రామానికి చెందిన బొందం అప్పలరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయి ఆస్తులను అమ్ముకున్నాడు.
అప్పలరాజు కుటుంబ సభ్యులతో కలిసి గత నెల 20వ తేదీ నుండి అప్పలరాజు విశాఖ లాడ్జీలోనే ఉంటున్నారు. వ్యాపారంలో నష్టపోయి చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తన భార్య మానస, పిల్లలు కీర్తి (6), సాత్విక్ (5)లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఘటనా స్థలంలో ఉన్న సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. చిన్న పిల్లలతో సహా భార్య, భర్త ఆత్మహత్యకు పాల్పడటం చూపరుల హృదయాలను కలచివేస్తోంది. విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పలరాజు కుటుంబం ఆత్మహత్యపై బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.