(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసినా.. తెలంగాణలో మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు ఇంకా ఆగడం లేదు. తాజాగా తనను ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూరులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డ యువకుడు.. ఆమె వినడం లేదని కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులపైనా కిరోసిన్ పోసి అగ్గి పెట్టాడు. అనంతరం తనకు తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో యువతి, యువకుడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.