(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొని వచ్చినా, కఠినంగా శిక్షలు అమలు చేస్తున్నా మహిళలు, యువతులపై వేధింపులు, దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో ప్రేమోన్మాది చేతిలో ఒక యువతి అసువులు బాసింది.
విశాఖ గాజువాక ప్రాంతంలోని సుందరయ్య నగర్ కు చెందిన ఇంటర్ పూర్తి చేసిన యువతిని స్నేహితుడే అతి దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. గాజువాక పాఠశాలలో చదువుతున్న సమయంలో ఆ యువతికి అఖిల్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. గత మూడేళ్లుగా వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతుంది. అయితే ఇటీవల ఆ యువతి రాము అనే యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని అఖిల్ జీర్ణించుకోలేకపోయాడు. ఆ యువతి విషయంలో అఖిల్, రాముల మధ్య ఇటీవల ఘర్షణ కూడా జరిగింది. కాగా శనివారం సాయి బాబా ఆలయం సమీపంలో ఆ యువతితో రాము ఉండటాన్ని చుసిన అఖిల్ వెంటనే కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనతో ఖంగు తిన్న రాము అక్కడి నుండి పరారు అయ్యాడు. రక్తపు మడుగులో ఆ యువతి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా అఖిలే స్వయంగా తన తండ్రికి ఫోన్ చేసి తాను ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేసినట్లు చెప్పాడు. అఖిల్ తండ్రి పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు.
పోలీస్ లను చూసిన అఖిల్ పారిపోతుండగా వారు వెంబడించి పట్టుకుని స్టేషన్ కు తరలించారు. యువతిని స్థానికులు అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకొని వెళుతుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ ఘటనతో యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఘటనా స్థలం నుండి పారిపోయిన రామును కూడా శనివారం రాత్రి పోలీస్ లు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?