Sonu Sood: వెంకటేశునికి మొక్కుకొని తిరుమల కొండలకు నడిచి వెళ్లేవారిని చూస్తుంటాం.పాదయాత్రలు చేసే రాజకీయ నాయకులు కూడా మనకు తెలుసు.కానీ కరోనా సమయంలో విశేష సేవలందిస్తున్న తన అభిమాన నాయకుడిని కలుసుకోవడం కోసం ఒక యువకుడు ఏడు వందల కిలోమీటర్లు నడిచి వెళ్లడం అరుదైన విషయమే.
ఇది ఎక్కడో జరగలేదు.మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణా రాజధాని హైదరాబాదులోని ఈ విశేషంచోటుచేసుకుంది.హైద్రాబాద్ నుండి వెంకటేష్ అనే యువకుడు ఏడు వందల కిలోమీటర్లు నడిచి ముంబాయికి వెళ్లి తన అభిమాన నేతను కలుసుకున్నాడు.ఇంతకీ ఆ నేత ఎవరో తెలిస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. అతనేమీ రాజకీయనాయకుడు కాదు. సీఎం కాదు .పీఎం కాదు.కరోనా వేళ ప్రజలకు ఆపద్బాంధవునిగా మారిన సినీ నటుడు సోనూసూద్ ను కలవడం కోసం ఆ యువకుడు ఇంత రిస్క్ తీసుకున్నాడు.
Sonu Sood: అనితర సాధ్యమైన రీతిలో సోనూసూద్ సేవలు!
కరోనా భారతదేశాన్ని కమ్మేసిన వేళ సోనూసూద్ నేనున్నానంటూ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.మొదటి వేవ్ లో వలస కార్మికులను వారి సొంత ఊళ్లకు పంపడానికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన ఘనత ఆయనదే.విమానాలతో సహా ఏ వాహనం వీలైతే ఆ వాహనాన్ని వలస కార్మికుల కోసం సోనూసూద్ ఏర్పాటు చేయడం విదితమే.ఇక కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా ఆయన ఆక్సిజన్ కొరతను గమనించి ఎక్కడ అవసరమైతే అక్కడ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సోనూసూద్ ను స్ఫూర్తిగా తీసుకొని మన మెగాస్టార్ చిరంజీవి కూడా జిల్లాలలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయటం ఇక్కడ గమనార్హం.కరోనా బాధితులకు సోనూసూద్ చేస్తున్న సేవలు అనితర సాధ్యమైనవిగా అందరి ప్రశంసలు పొందుతున్నాయి.ఇవన్నీ గమనించిన వెంకటేష్ ఆయన వీరాభిమాని గా మారాడు.సోనూ సూద్ ను కలుసుకోవడం కోసం బొంబాయికి ఆయన హైదరాబాదు నుండి ఏడు వందల కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు.
ఆనందకరమే కానీ అలా చేయవద్దు!
కాగా వెంకటేష్ ను సోనూసూద్ సాదరంగా రిసీవ్ చేసుకున్నారు.మంచి ఆతిథ్యం ఇచ్చారు.ఇది నిజంగా తనకు ఆనందం కలిగించిందని సోనూసూద్ ట్వీట్ చేశారు.తాను రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తానన్నా వేంకటేష్ వద్దన్నాడని ఆయన తెలిపారు.అతని పట్టుదల తనకు ప్రేరణ ఇచ్చిందని కూడా సోనూసూద్ పేర్కొన్నాడు.కానీ నా అభిమానులెవరూ ఇలాంటి పనులు చేయవద్దు..వీలైనంతగా ప్రజా సేవ చేయండి అంటూ సోనూసూద్ ఆ ట్వీట్లో కోరాడు.