ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ – వైసీపీ నేతల మధ్య ఇప్పటికే ప్రమాణాలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల పోరు సాగుతోంది. తాజాగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ను మరింత పెంచాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని లెక్క చేయనని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. తమ పథకాల లబ్ధిదారులకు రుణాలు ఇవ్వని బ్యాంకుల ముందు చెత్త వేయించే చెత్తపని ఏపీ ముఖ్యమంత్రి చేస్తున్నాడని కూడా ఆయన ఆరోపించారు.అలాగే ముఖ్యమంత్రి సహకారంతోనే తిరుపతిలో అన్యమత ప్రచారం జోరుగా సాగుతోందని కూడా వీర్రాజు విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులు బీజేపీ చీఫ్పై కౌంటర్ అటాక్ చేస్తున్నాయి.
కాకపెంచిన కాకాని వ్యాఖ్యలు
తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సోము వీర్రాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తాము సోము వీర్రాజుని లెక్క చేయమని అన్నారు. వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నామని, ఎమ్మెల్యేగా నేనే వీర్రాజును లెక్క చేయనప్పుడు సీఎం స్థాయి నాయకుడు ఆయన పట్టించుకుంటారా అని ప్రశ్నించాడు. అంతేగాకుండా బీజేపీలో ఉన్న టీడీపీ నేతలు ఫిర్యాదుతోనే సోము వీర్రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి నాయకుడు నియోజకవర్గ స్థాయికి దిగజారిపోకూడదని అన్నారు. బ్యాంకుల వద్ద చెత్త అంశంపై విచారణ జరుగుతోందదని స్పష్టం చేశారు. ఇప్పుడే మాట్లాడడం సరికాదని కాకాని వ్యాఖ్యానించారు.
అన్యమత ప్రచారం అవాస్తవం !
సోము వీర్రాజు మాటలకు కౌంటర్గా ఏపీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ… బ్యాంకు ముందు చెత్త వేయించే చెత్త పనులు చేయాల్సిన ఖర్మ జగన్ కు పట్టలేదని అన్నారు. ఆ పని ప్రభుత్వమే చేయించిందన్న సోము వీర్రాజు వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా మత ప్రచారం చేసుకోవాల్సిన పని జగన్కు లేదని అన్నారు. తిరుమల కొండపై తాను అన్యమత ప్రచారం చేశానని సోము వీర్రాజు చేసిన ఆరోపణలు అర్ధరహితం అని తెలిపారు.తన తెలంగాణ కౌంటర్ పార్ట్ బండి సంజయ్ మాదిరి తాను కూడా దూకుడు ప్రకటనలతో ఆంధ్రప్రదేశ్లో క్రేజ్ తెచ్చుకోవాలని సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.అయితే ఏపీలో అత్యంత బలంగా ఉన్న వైసీపీ ఆయనకు ఆదిలోనే బ్రేక్ వేసింది.