Breaking: వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఒ యువకుడు వికేంద్రీకరణకు మద్దతుగా ఆత్మహత్యాయత్నంకు పాల్పడటం తీవ్ర సంచలనం అయ్యింది. గంధవరం నుండి యువకులు భారీ ర్యాలీగా చోడవరం బయలుదేరారు. ఈ ర్యాలీలో శ్రీనివాసరావు అనే యువకుడు జై విశాఖ అని నినాదాలు చేస్తూ వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్లు మంటలు ఆర్పి గాయపడిన శ్రీనివాసరావును ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా దగ్ధం అయ్యింది. కాగా చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును పరామర్శించారు.
ఓ పక్క అమరావతిని రాజధాని కొనసాగించాలంటూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతులు అరసవెల్లికి పాదయాత్ర కొనసాగిస్తుండగా, ఉత్తరాంధ్రలో వికేంద్రీకరణకు అనుకూలంగా జేఏసీ కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 15న జేఏసీ ఆధ్వర్యంలో విశాఖలో భారీ గర్జన నిర్వహణకు పిలుపునిచ్చింది. దీనిపై వైసీపీ మద్దతు ప్రకటించింది. రైతుల ముసుగులో అమరావతి టీడీపీ రియల్ ఎస్టేట్ వర్గాలు చేస్తున్న పాదయాత్రగా వైసీపీ ఆరోపిస్తోంది. మరో పక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికి అమరావతి రైతుల పాదయాత్ర ఎంటర్ కాకముందే ఎలూరు, తణుకు తదితర ప్రాంతాల్లో మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర పొడవునా ఒక్క రాజధాని వద్దు,.. మూడు రాజధానులు ముద్దు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.