ఏపీలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినప్పటినుంచి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు వైకాపా అధినేత వైఎస్ జగన్. సంచలన నిర్ణయాలు తీసుకోవడంలోనూ.. వాటిని అమలు చేయడంలోనూ.. జగన్ తండ్రిని మించిన తనయుడిగా పేరు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ ఇంతకాలం తీసుకున్న నిర్ణయాలు అన్నీ.. ఆయన పాదయాత్రలో జనాలను, పరిస్థితులనూ ప్రత్యక్షంగా చూడటంవల్లే అనేది అందరి అభిప్రాయం. అయితే… అది వాస్తవమే అయినా.. అందులో మరో రహస్య వాస్తవం దాగుందనే విషయం ఒకటి వైసీపీలో హల్ చల్ చేస్తోంది.
అవును… జగన్ ఇచ్చే హామీలు, తీసుకునే నిర్ణయాలు, అమలుచేసే పథకాలు అన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటయి. వాటిలో అత్యంత కీలకమైనవి… దిశ పోలీసు స్టేషన్లు, పాఠశాలల ఆధునీకరణ సహా.. మహిళలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు! అయితే ఇలాంటి కొన్ని కీలకమైన, మరింత ఆసక్తికరమైన నిర్ణయాల వెనుక జగన్ ఆలోచనలతో పాటు, ఆయన సతీమణి భారతి హస్తం కూడా పుష్కలంగా ఉందంట! ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్!
ఈ తరహా పరిణామాలు రాజకీయాల్లో కొత్తేమీ కాదు! గతంలో ఎన్టీఆర్ ను లక్ష్మీపార్వతి నడిపించారనే వ్యాఖ్యలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. ఆయన వెన్నుపోటు గురైన అనంతరం తమను తాము సమర్ధించుకోవడానికి చంద్రబాబు & కో లకు ఇది పెద్ద అస్త్రంగా పనిచేసిందనుకోండి… అది వేరేవిషయం! అదే విధంగా… చంద్రబాబు తీసుకునే చాలా నిర్ణయాల్లో ఆయన సతీమణి భువనేశ్వరి పాత్ర ఉందని అప్పట్లో మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ విషయానికొస్తే… సీఎం కేసీఆర్ కూడా సతీమణి శోభ సూచనలు పాటించిన సందర్భాలు అనేకం ఉన్నాయని అంటుంటారు!
అదే క్రమంలో తాజాగా ఏపీ సంచలన సీఎం జగన్ కూడా ఆయన సతీమణి భారతి సూచనలు సలహాలూ కొన్ని వింటున్నారని.. పేదలకు ఇంగ్లీషు మీడియం విద్య అనే ఆలోచన ఆమె మస్తిష్కం లోంచి పుట్టిందే అని తెలుస్తోంది. భార్య అంటే భర్తలో సగం అనే మాట సామాన్యులకే కాదు సుమా… సీఎం స్థానాల్లో ఉన్నవారికీ అప్లై అవుతోంది మరి! ఏది ఏమైనా… ప్రజలకు మంచి చేసే క్రమంలో.. పేదల బ్రతుకులు మార్చే విషయంలో.. మహిళలకు అత్యంత ధైర్యాన్ని, ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగించే విషయంలో.. భర్తకు బాసటగా నిలుస్తున్న భారతికి జై కొట్టాల్సిందే అంటున్నారు పార్టీ నాయకులు.. ఈ విషయం తెలిసిన అనంతరం ప్రజలు కూడా!!