YS Family.. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరుకు ఎంత బ్రాండ్ వాల్యూ ఉందంటే.. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆయన చిరునవ్వు చెరిగిపోనంత. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన వేసిన ముద్ర అలాంటిది. ఖచ్చితంగా ఆయన జీవించి ఉంటే తెలుగు రాష్ట్ర రాజకీయాలో మరోలా ఉండేవి అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన మరణం తర్వాత ఆయన క్రేజ్ జగన్ కు శ్రీరామరక్ష అయింది.
జగన్ వెనుక ఏదో పవర్ ఉందంటే అది వైఎస్సే. నేడు షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాట్లు చేస్తున్నా కూడా అదే వైఎస్ ఫొటోనే కారణం. లోటస్ పాండ్ కు వెల్లువలా వస్తున్న వైఎస్ అభిమానులే ఇందుకు నిదర్శనం. అయితే.. ఏపీలో తనయుడి విజయం చూసి పొంగిపోయిన విజయమ్మకు కుటుంబంలోనే కలతలు రావడం బాధించేదే. జగన్, షర్మిల మధ్య అగాధమే ఏర్పడిందో.. ముభావమో తెలీదు.. ఇప్పుడు విజయమ్మ ఎవరివైపు అనే ప్రశ్నే అందరి మదిని తొలిచేస్తోంది.
వైఎస్ జగన్ కే సాధ్యం..
వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైఎస్సార్సీపీ అనే పార్టీ పెట్టుకుని తొమ్మిదేళ్లు ఒంటరి పోరాటం చేయడం సామాన్యమైన విషయం కాదు. జగన్ లోని పట్టుదల, విజయమ్మ వెనకుండి చేసిన దిశానిర్దేశం, సోదరి షర్మిల భరోసా, భార్య భారతి నమ్మకం.. ఇలా జగన్ ను వెన్నంటి నడిపించాయి. 2017 అక్టోబర్ నుంచి 2019 జనవరి వరకూ ఏకధాటిగా పాదయత్ర చేయడమంటే సమకాలీన రోజుల్లో మరెవరికీ సాధ్యం కాని విషయం. విశాఖ ఎయిర్ పోర్టులో తనను అడ్డుకున్న పోలీసులతో రెండున్నరేళ్ల తర్వాత నేనే సీఎం అన్నా.. నంద్యాల ఉప ఎన్నికలో ఓడిన తర్వాత.. కొట్టారు తీసుకున్నాం.. మాకూ టైమ్ వస్తుంది.. అని ధీశాలిగా చెప్పినా అవి జగన్ కు తనపై తనకు ఉన్న నమ్మకం. అన్నట్టుగానే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రగా చెప్పుకునే తిరుగులేని విజయం సాధించారు జగన్.
జగన్ విజయంలో షర్మిల పాత్ర..
ఇంతటి కుటుంబ నేపథ్యం వైఎస్ ఫ్యామిలీకి ఉంది. ఇన్నాళ్లూ అంతా సవ్యంగానే ఉన్నా ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక్క కుదుపు.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టే ఏర్పాట్లు చేయడం కలకలం రేపింది. అసలు వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతోందనేదే అందరికీ ప్రశ్న. వైఎస్సార్సీపీ పార్టీ నిలవడంలో, జగన్ సీఎం కావడంలో సోదరి వైఎస్ షర్మిల పాత్ర ఎంతో కీలకం. ఇది కాదనలేని వాస్తవం. జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయన బాధ్యతను సోదరిగా షర్మిల తీసుకున్న తీరు జగనన్న వదిలిన బాణంగా రాష్ట్ర పర్యటనలో దూసుకుపోయిన తీరు ఎవరూ మర్చిపోలేనిది. 2019 ఎన్నికల సమయంలో కూడా అన్నకు చేదోడువాదోడుగా ప్రచారం చేస్తూ చెప్పిన ‘బై.. బై బాబు’ అనే డైలాగ్ పేలిపోయింది. ఇలా జగన్ సీఎం అయ్యేందుకు ఆ కుటుంబం ఎంతో అండగా నిలిచింది. ఇప్పుడు ఆ బంధాలకే బీటలు వారుతున్నాయి.
విజయమ్మ ఎవరి వైపు..
ఇంత చేసిన షర్మిలకు పార్టీలోనో, ప్రభుత్వంలోనో పదవి ఖాయమనే అనుకున్నారు అంతా. కానీ.. అలా జరగలేదు. జగన సీఎం అయి రెండేళ్లు కావొస్తున్నా షర్మిల జాడే ఎక్కడా కనిపించలేదు. ఒక్కసారిగా తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు ప్రకంపనలు. ఈ నేపథ్యంలో అందరి చూపు ఇప్పుడు విజయమ్మపై ఉంది. ఆమె ఎవరివైపు ఉంటారనేదే ఆసక్తికరంగా మారింది. ఇటివల హైదరాబాద్ లో ఓ వేడుకలో విజయమ్మ, షర్మిల, వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కనిపించారని.. జగన్ సతీమణి భారతి కూడా లేరని తెలుస్తోంది. తండ్రి మరణంపై హైకోర్టులో పిటీషన్ వేసి సీబీఐ ఎంక్వైరీ జరిగేలా చూశారు. కేరళ వెళ్లి సామాజిక కార్యకర్తతో భేటీ అయ్యారు. దీంతో ఆమె జగన్ కు దూరమనే సంకేతాలు కనిపించాయి. మరోవైపు షర్మిల పార్టీ ఏర్పాట్ల రోజున సాక్షిలో పెద్దగా కవరేజ్ లేకపోవడం, లోటస్ పాండ్ వద్ద బ్యానర్లో జగన్ ఫొటో లేకపోవడం.. ఆ తర్వాత కనిపించడం.. ఇవన్నీ వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతోందనే ప్రశ్నలే రేకెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల్లో బలమైన ముద్ర వేసిన వైఎస్ కుటుంబంలో నిజంగా విబేధాలు వచ్చాయా.. లేక ఇవన్నీ టీకప్పులో తుఫానులేనా అన్నది చూడాలి..!