రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వాన్ని మోడీ సర్కారు ఇబ్బందులకు గురి చేయగలదని రకరకాల కథనాలు వస్తున్నప్పటికీ వాస్తవంగా ఢిల్లీ స్థాయిలో అలాంటివేమీ జరగడం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాజ్యసభలో సంఖ్యాపరంగా బీజేపీకి తక్కువ మంది సభ్యులు ఉండటంతో ఆ పార్టీ వైసిపి పైన ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొందంటున్నారు. ఇప్పటికీ రాజ్యసభలో బీజేపీ ,ఆ పార్టీ మిత్రపక్షాలకు ప్రతిపక్షం కంటే ఇరవై మంది సభ్యుల సంఖ్య తక్కువగా ఉంది.
అందువల్ల రాజ్యసభలో ఏదైనా ముఖ్యమైన బిల్లు ఆమోదం పొందాలంటే బిజెపి తప్పనిసరిగా వైసిపి లాంటి పార్టీలపై ఆధార పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. 2022 నాటికి ఆ సంఖ్య పన్నెండు దాకా పెరుగుతుంది. ఈ మ్యాజిక్ ఫిగరే వైసిపికి శ్రీరామరక్ష కాగా …దీన్ని చూసైనా బిజెపి తప్పనిసరిగా జగన్ విషయంలో తగ్గి ఉండాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు ఎలాంటి రచ్చ చేసినా జగన్ పెద్దగా స్పందించడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో సామరస్య ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. గల్లీ బీజేపీ నేతలతోనే జగన్ కు ఇబ్బంది గాని ఢిల్లీ నాయకులు మాత్రం జగన్ తో సఖ్యత గానే ఉంటున్నారు. కాబట్టి ఏదో జరగబోతోందన్న ప్రచారంలో వాస్తవం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.