YS Jagan : ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల ముగిసిన వెంటనే నగర పాలక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఒకే చెప్పింది. ఈ తరుణంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తీవ్ర స్థాయిలో ఉద్యమం జరుగుతోంది. వివిధ రాజకీయ పక్షాలు కార్మికుల ఆందోళనలు, నిరసనలకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణంరాజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ తీరు, రాజకీయ పరిస్థితులు, అమరావతి రాజధాని అంశం, ఆలయాలపై జరిగిన దాడులు, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర అంశాలను వివరించారు. తాను చెప్పిన అంశాలపై ప్రధాన మంత్రి మోడీ సానుకూలంగా స్పందించారని రఘురామ కృష్ణంరాజు మీడియాకు తెలిపారు. స్టీల్ ప్లాంట్ విషయంపై ప్రధాని మోడీ నుండి అభయం లభించినట్లుగా భావిస్తున్నానన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధాన మంత్రి మోడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కలవాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎంపీలతో జగన్ ఢిల్లీకి వచ్చి మోడీని కలిసి విజ్ఞప్తి చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని అన్నారు రామకృష్ణం రాజు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విశాఖలో నిరసన కార్యక్రమాలు జరుగుతుండగా అవి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కి ఒత్తడి వస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను పునః సమీక్షించాలంటూ జగన్ లేఖ రాశారు. త్వరలో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని కలిసే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. పీఎం మోడీ అపాయింట్మెంట్ కూడా వైసీపీ ఎంపిలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ప్రదాన మంత్రి మోడీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో జగన్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతారని అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కానివ్వమంటూ అఖిలపక్ష, కార్మిక, ప్రజా సంఘాల నేతలు పేర్కొంటున్నారు. అవసరమైతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ తరహాలో ఆందోళన తీవ్ర తరం చేస్తామని చెబుతున్నారు.