వైసీపీలోకి ఇతర పార్టీల వారిని చేర్చుకునే సమయంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న వైఖరి మీద రుసరుసలు వినిపిస్తున్నాయి.
అయితే జగన్ ని బహిరంగంగా ఏమనలేక లోలోనే వైసీపీ నేతలు కుమిలిపోతున్నారు.ఇప్పటికే టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోయారు. వారంతా పార్టీ కండువా కప్పుకోకపోయినా తెలుగుదేశం పార్టీ నుంచి విడాకులు తీసుకున్న వారే. అనధికారికంగా జగన్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న వారే. అయితే ఇప్పుడు పార్టీలో జగన్ చేర్చుకుంటున్నందుకు కాదు. తమకు కనీస సమాచారం కూడా జగన్ ఇవ్వకపోవడంపై వైసిపి నేతలు గుర్రుగా ఉంటున్నారు.జగన్ తొలి నుంచి అంతే. ఎవరినైనా పార్టీలోకి తీసుకోవాలంటే అప్పటి వరకూ ఆ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను చూస్తున్న వారికి తెలియపర్చాలి. ఇది కనీసం ధర్మం. వారు అభ్యంతరం చెప్పే అవకాశమే లేదు.
ఎందుకంటే జగన్ ఒక నిర్ణయాన్ని తీసుకుంటే వెనుకాడరన్న సంగతి తెలిసిందే. కానీ కనీసం కర్టెసీ గా కూడా వారికి చెప్పకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీని ఏళ్లుగా నమ్ముకున్న తమకు కనీసం సమాచారం ఇవ్వకపోవడమేంటన్న అసంతృప్తి వైసీపీ నేతల్లో ఉంది.గన్నవరం నియోజకవర్గం టిడిపి శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తాడేపల్లిలోని జగన్ కార్యాలయం చేరుకునే వరకూ ఎవరికీ తెలియదు. అక్కడ ప్రత్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు కూడా సమాచారం అందించకుండానే వల్లభనేని వంశీని పార్టీలోకి తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ గొడవ మామూలుగా లేదు. ఇక మద్దాలి గిరి విషయంలోనూ అంతే. గుంటూరు పశ్చిమ నియోజవర్గంలో ఇప్పుడు నేతల మధ్య సఖ్యత లేదు.వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుకు డీసీఎంఎస్ ఛైర్మన్ ఇచ్చినా, గిరి ఓడించిన ఏసురత్నంకు మిర్చి యార్డు ఛైైర్మన్ పదవి ఇచ్చినా ఫలితం లేదు.
చీరాల్లో టిడిపి ఎమ్మెల్యే కరణం బలరామ్ ని పార్టీలో కి తీసుకున్నప్పుడు కూడా జగన్ ఇదే వైఖరి అనుసరించారు.నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ ప్రమేయం లేకుండానే బలరామ్ పార్టీలో చేరిపోయారు.ఇప్పుడు బలరామ్ ఆమంచి మధ్య ఆధిపత్య పోరాటం తారాస్థాయికి చేరింది ఈ మధ్యే బలరామ్ కుమారుడు కరణం వెంకటేష్ బహిరంగ సభలో ఆమంచి మీద అవాకులు చవాకులు పేలటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.పైగా ఇతర నియోజకవర్గాల్లో టిడిపి ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నప్పుడు జగన్ తన సొంత పార్టీ ఇంచార్జీలకు ఏదో ఒక పదవిచ్చారు.చీరాల్లో అలా కూడా జగన్ చేయలేదు.తాజాగా విశాఖ నార్త్ టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి లోకి వచ్చారు.ఈ సందర్భంలో కూడా గణేష్ చేతిలో ఓడిపోయిన వైసీపీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్కు కనీస సమాచారం లేదు.
అయితే ద్రోణంరాజుకు ముందే కేబినెట్ ర్యాంకు పదవిని జగన్ ఇచ్చారు.అది గుడ్డిలో మెల్ల లాగుంది. ఇలా చేర్చుకుంటే చేర్చుకున్నారు కానీ తమకు కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో వైసీపీ నేతల్లో జగన్ తీరుపట్ల అసంతృప్తి కలుగుతోంది.జగన్ ఒంటెద్దు పోకడలు పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తాయని వైసిపి నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.అయితే జగన్ నైజం తెలిసిన వారు కాబట్టి ఎవరూ ఆయనకు ఇప్పుడు ఎదురు చెప్పలేకపోతున్నా భవిష్యత్తులో వారు ఎదురు తిరిగే అవకాశం లేకపోలేదు .