వైసీపీలో పొడచూపుతున్న అసమ్మతి , అంతర్గత విబేధాల మీద పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు .ప్రత్యేకించి అన్నిటికంటే పెద్ద తలనొప్పిగా మారిన నెల్లూరు జిల్లా విషయాన్ని ఆయన మొదటగా టేకప్ చేశారు.
నెల్లూరు జిల్లా వైసీపీ లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పైన ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు ,ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గీయులు కత్తులు నూరుతున్నారు.విధేయతను, అనిల్ కుమార్ యాదవ్ గత ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఆయనకు నెల్లూరు జిల్లా నుండి మంత్రి పదవి ఇచ్చారు.కానీ వైసిపి ఎన్ఐటిల్లో చాలామంది సీనియర్లు ఉన్నారు.కొందరు నాలుగు సార్లు, మరికొందరు రెండు సార్లు.. అంతకు మించి గెలిచి ఉన్నారు.అన్నిటికీ మించి నెల్లూరు జిల్లా అంటే రెడ్ల కంచుకోట.అలాంటి నెల్లూరు జిల్లాలో రెడ్డి ఎమ్మెల్యేలను పక్కన బెట్టి బీసీ అయిన అనిల్ కుమార్ యాదవ్ కి మంత్రి పదవి ఇవ్వడం వారికి రుచించలేదు.
పైగా అనిల్ కుమార్ కూడా ఒంటెద్దు పోకడలు పోతున్నారట.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి బహిరంగంగానే అనిల్ కుమార్ ని దులిపేశారు. ఆయనే కాదు…ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్థన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి తదితరులకు కూడా మంత్రితో పొసగడం లేదు మంత్రి గా అనిల్ ఉన్నా ఆయన ఏ ఎమ్మెల్యే నియోజకవర్గంలోకి అడుగు పెట్టే పరిస్థితి లేదు. దీంతో ఇక్కడ జగన్ నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు.అందరూ సీనియర్ నేతలే కావడంతో కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందన్న నివేదికలు జగన్కు వెళ్లడంతో జగన్ చివరకు నెల్లూరు జిల్లాలో నేతల పంచాయితీని సరిచేసే బాధ్యతను అదే జిల్లాకు చెందిన మరో మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి అప్పగించారు. గౌతంరెడ్డికి ఏ ఒక్కరితోనూ గ్యాప్ లేదు. తన పని తాను చేసుకుపోతుంటారు. ఆయన్ను అందరూ అభిమానిస్తారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండడం ఆయన నైజం. గౌతంరెడ్డి జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలతో మాట్లాడి వీరిని ఓ రోజు కూర్చోపెట్టి వారి సమస్యలు విననున్నారు. మేకపాటి సయోధ్య ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి!