అమరావతి: నవరత్న పథకాలతో అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుందని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం జగన్ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ, విశాఖ జిల్లా అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి తదితర ప్రాంతాల్లో జరిగిన సభల్లో ప్రసంగించారు.
నవరత్న పథకాలు అన్నీ ప్రతి గడపకు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. చెడిపోయిన ఈ వ్యవస్థ బాగుపడేందుకు ప్రతి ఒక్కరూ వైసిపికి మద్దతు ఇవ్వాలని జగన్ కోరారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, చంద్రబాబు మోసపరిత విధానాలను ఎండగట్టారు.
గత ఎన్నికల హయాంలో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలను జగన్ ప్రజలకు వివరిస్తూ వీటిలో ఒక్క హామీ అయినా చేసారా అని ప్రశ్నించారు.
చంద్రబాబు మోసపూరిత చర్యలను ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వకు, తాతకు, రైతన్నలకు తెలియజేయాలని జగన్ సూచించారు. జగనన్నతోనే రాజన్య రాజ్యం వస్తుందని గ్రామాల్లో వివరించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలు రాకుంటే, తాను ప్రకటించకుండా ఉంటే చంద్రబాబు ఫింఛన్ పెంచేవారా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ హయాంలో అమలు చేసిన రైతులకు సున్నా వడ్డీ రుణాల పథకాన్ని మళ్లీ తీసుకువస్తామని జగన్ హామీ ఇచ్చారు.
చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు ఆశపడి మళ్లీ మోసపోవద్దని జగన్ ప్రజలకు హితవు పలుకుతూ మరో నెల రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని భరోసా ఇచ్చారు. వైసిపి అభ్యర్థులకు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని జగన్ ప్రజలను కోరారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.