జగన్ సీబీఐ కేసులకు భయపడుతున్నారు.. అందుకే ప్రత్యేక హోదా విషయంలోనూ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలోనూ మోడీని నిలదీయడం లేదని ప్రతిపక్షాలు.. జగన్ సీబీఐ కేసులకు భయపడి మోడీకి తలొగ్గుతున్నారని జేసీ లాంటి నేతలు.. జగన్ పై నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటారు. ఈ విమర్శల్లో అసలు నిజానిజాలు ఎంత.. జగన్ కు భయమేనా.. నిజంగా మోడీ అంటే భయమేనా.. ఆ భయం కూడా సీబీఐ కేసులకోసమేనా లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం!
అసలు ముందుగా జగన్ కు భయం ఉందా? అనే విషయం నుంచి మొదలుపెడితే… ఇప్పుడు మోడీ ఎంత బలంగా ఉన్నారో, నాటి యూపీఏ ప్రభుత్వం కూడా ఏమాత్రం తీసిపోనంత బలంగానే ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ఎదురించడం చిన్నవిషయమేమీ కాదు. అయినా కూడా జగన్ భయపడలేదు. కన్నతల్లి, తోడబుట్టిన చెల్లి, కట్టుకున్న భార్య కుటుంబసభ్యులంతా నడిరోడ్డుపై నిలబడి జగన్ జైలుకెళ్లే సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు… జగన్ భయపడలేదు! పదహారు నెలల పాటు జైలులో ఉన్నారు… జగన్ భయపడలేదు! అసలు భయపడే వ్యక్తే అయితే… జైలుకి వెళ్లే పరిస్థితి ఎందుకు వస్తుంది… నాడు సోనియా దగ్గర “అమ్మా” అని సలాం కొడితే ఏ సెంట్రల్ మినిస్టర్ పదవో రాకుండాపోతుందా? అప్పుడు జగన్ ఒక సాధారణ రాజకీయ నాయకుడు… మరి ఇప్పుడు? 175స్థానాలకు ఎన్నికలు జరిగితే 151 స్థానాలను కైవసం చేసుకున్న, లోక్ సభలో నాలుగవ పెద్ద పార్టీగా ఉన్న పార్టీకి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి. నాడే లేని భయం.. నేడు ఉంటుందా?
పోని నిజంగానే మోడీ తలచుకుని, జగన్ పై కోపపడి సీబీఐ కేసుల్లో జైలుకు పంపితే… గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగానే అకారణంగా కటకటాలపాలుచేస్తే… జగన్ కు వచ్చిన నష్టం ఏమీ లేదనే చెప్పాలి! ఆయన జైలులో ఉన్నపుడే.. వైసీపీ ఒక పార్టీగా విపక్షంలో నిలిచి అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశాన్ని ఎదుర్కొని నిలిచింది. ఇపుడు ఎటూ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి… మళ్లీ అదే జరిగితే, జగన్ మళ్ళీ జైలుకు వెళ్తే… దానికి తగ్గట్లుగా తన ఏర్పాట్లు తాను చేసుకునే ఆలోచన జగన్ కు లేదని అనుకుంటే అది అమాయకత్వమే అవుతుంది. కాబట్టి “జగన్ కు భయం” అనే మాటకు అర్ధమే లేదు. మోడీకి సలాం కొడుతున్నది సీబీఐ కేసులకు భయపడే అనే విమర్శలో అసలు పసే లేదు!
నాడు సోనియా అన్నా, నేడు మోడీ అన్నా, సీబీఐ అన్నా జగన్ కు భయం లేకపోతే… ఎందుకు కేంద్రం దగ్గర మెతకవైఖరి ప్రదర్శించినట్లు కనిపిస్తుంటారు అనే ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. జగన్ మోడీ దగ్గర.. అంటే కేంద్రప్రభుత్వం దగ్గర భయపడతారు! కానీ… అది సీబీఐ కేసులకోసం కాదు.. జనాల కోసం. అవును… రాజకీయ పార్టీల దగ్గర, కేంద్ర ప్రభుత్వాల దగ్గర విశ్వాసం కోల్పోయినా, నమ్మకం కోల్పోయినా పర్లేదు… రాజకీయావసరాలు మళ్లీ దగ్గర చేసేస్తాయి! ఉదాహరణకు “బీజేపీ – టీడీపీ” బంధాలు ఉదారణలుగా ఉండనే ఉన్నాయిగా! కానీ… ఇంతగా నమ్మిన జనాల దగ్గర మాత్రం జగన్ విశ్వాసం, నమ్మకం కోల్పోవాలని అనుకోవడం లేదు! అందులో భాగంగానే రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిన కేంద్రం వద్ద మంచిగా ఉంటున్నారు. అది బానిసత్వం అన్నా, కేసుల వల్ల భయం అన్నా, ఇంకేమన్నా జగన్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు కానీ… రాష్ట్రానికి మాత్రం ఇబ్బంది రావొద్దు.
ఎందుకంటే… ఇప్పుడు జగన్ ముందున్నది ఒకటే లక్ష్యం! రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, జనాలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నూటికి నూరుశాతం నిలబెట్టుకోవాలి. అలా జరగాలి అంటే… కేంద్రంతో కాస్తా సహనంతో, రాజీ ధోరణితో ఉండాలి… ప్రస్తుతం జగన్ చేస్తుంది అదే! చంద్రబాబు నాలుగేళ్ళు కేంద్రంతో బాగుండి చివరి ఏడాది గొడవ పెట్టుకున్నారు.. ఫలితంగా బాబు రాజకీయ జీవితం ప్రశ్నార్ధకం అవ్వడానికి ఒక కారణం తోడయ్యింది అన్న విషయం పక్కనపెడితే… ఏపీ ప్రజలకు తీరని నష్టం జరిగింది! అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా.. కేంద్ర రాష్ట్ర సంబంధాల వరకూ పరిధులు చూసుకుని మోడీతో జగన్ సఖ్యతగా ఉంటున్నారనేది వైకాపా నేతలు మాట… విశ్లేషకుల అభిప్రాయం కూడా!! అవును జగన్ కు భయమే… రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందేమో అని!