రాజస్థాన్ లో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. క్షణక్షణం మారిపోతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి అశోక్ గహ్లాట్ పై ఎగిసిపడ్డ తిరుగుబాటు నేతలు ఒక్కసారిగా మెత్తబడ్డారు. తమ ప్రభుత్వంపై ఒక్కసారిగా తిరగబడ్డ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. అయితే తన వెంట 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, గహ్లాట్ ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న పైలట్.. అధిష్టానం చొరవతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి గహ్లాట్, పైలట్ మధ్య రాజీ కుదిర్చినట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతుంది.
అయితే పైలట్ పలు డిమాండ్లను పార్టీ ముందుంచారని.. పార్టీ చీఫ్గా తనను కొనసాగించడంతో పాటు తన వర్గానికి నాలుగు మంత్రి పదవులతో పాటు కీలక ఆర్థిక, హోంశాఖలను కట్టబెట్టాలని కోరికను వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా పార్టీలోని ఇరు వర్గాల మధ్య చర్చలు, సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయి. ఇదిలా నడుస్తుండగానే… ఎవరికి వారు నేతలను కాపాడుకొనేందుకు రిసార్డ్ రాజకీయం కూడా ప్రారంభమైంది. అయితే డిమాండ్లన్నీ నెరవేర్చే వరకు తగ్గేదే లేదని సచిన్ వర్గం భీష్మించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.
ఇదే సందర్భంలో.. ఇలాంటి సమస్యలకు తెగిందాకా లాగకూడదని.. అలా లాగే ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్ ను దూరం చేసుకొని.. కేంద్రంలో కూడా పట్టును కోల్పోవలసి వచ్చిందని కూడా అధిష్టానం విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ప్రియాంక గాంధీ మనిషిగా ఉన్న సచిన్ పైలట్ తో ప్రియాంక గాంధీ పలుమార్లు చర్చలు జరిపారని… అందులో భాగంగానే సచిన్.. ప్రియాంక మాటను కాదనలేక వెనక్కి తగ్గినట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా.. సచిన్ పైలట్ ను వదిలిపెడితే.. పార్టీకి మేకై, వైఎస్ జగన్ లా రాజస్థాన్ లో మరో బలమైన నేతగా మారే అవకాశం ఉందని కూడా స్పష్టమౌతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతతో బయటకు వచ్చిన వ్యక్తులే శక్తులుగా మారి వారి వారి రాష్ట్రాలలో బలమైన రాజకీయ శక్తులుగా అధికారంలో ఉంటడం విశేషం. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు.
కాగా జైపూర్ వేదికగా పార్టీలో రాజకీయ హైడ్రామా నడుస్తోంది. తన ప్రభుత్వం మైనారిటీలో పడలేదని, తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం గహ్లాట్ స్పష్టం చేయడంతో నెంబర్ గేమ్పై ఉత్కంఠ నెలకొంది. అలాగే.. రాజస్థాన్లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి కాలం పాలన సాగిస్తుందని ఆయన వివరించారు. కాగా 200 మంది సభ్యులున్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. అలాగే.. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్కు మద్దతిస్తున్నారు.