జగన్ ఎన్నికల్లో గెలిచి, అధికారం చేపట్టి ఏడాది అయ్యింది. అందులో ఒక మూడునెలలు హనీమూన్ పిరియడ్ అనుకుంటే.. రెండు నెలల పైన కరోనా పిరియడ్ అనుకుంటే.. ఇక మిగిలింది ఆరు నెలల కాలం. ఈ అతితక్కువ సమయంలో కూడా జగన్ చాలా సమర్ధవంతంగా పరిపాలన సాగించారనే అనుకోవాలి. సంక్షేమ పథకాల విషయంలో.. అక్టోబరులో అందాల్సిన పథకాలను కూడా కరోనా కాలంలో ఇబ్బందిపడుతున్న జనాలకు కాస్త ఉపశమనంగా ఉంటుందని నాలుగు నెలల ముందే అందించారు. ఈ స్థాయిలో జనాల గురించి జగన్ ఆలోచిస్తుంటే… ఆ జగన్ కు తలపోటులు రాకుండా చూసుకోవాలని సొంత పార్టీ నేతలే అనుకోకపోవడం ఇప్పుడు వైకాపా లో హాట్ టాపిక్ గా మారిందనే అనుకోవాలి.
ఇందులో భాగంగా కొంతమంది నేతలు ఇంతలోనే ఏదో మునిగిపోయినట్లు అప్పుడే జగన్ పై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు! జగన్ అధికారం చేపట్టేనాటికి రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందన్న విషయం సదరు ఎమ్మెల్యేలకు తెలియంది కాదు. అయినా కూడా సంక్షేమపథకాల విషయంలో అప్పు చేసైనా జనాలకు సాయపడాలని, అన్నమాట నిలబెట్టుకోవాలని జగన్ ముందుకుపోతున్నారు. ఈ క్రమంలో అధినేత మనసు అర్ధం చేసుకుని, కార్యకర్తలను కుదుటపరచాల్సిన నేతలే పార్టీపైనా, అధినేతపైనా అసహనం ప్రదర్శించడంపై జగన్ సీరియస్ గా ఉన్నారంట.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సహజంగానే మంత్రులు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గ నిధులు వెళ్లకపోవడం.. అవినీతి పై జగన్ ఉక్కుపాదం మోపడంతో ఎన్నికల ఖర్చులు రాబట్టుకునే మార్గాలు మూసుకుపోయాయని కొందరు నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ఇవే ఇప్పుడు వైకాపాలో అసంతృప్తికి కారణాలు అవుతున్నాయని అంటున్నారు! ఈ క్రమంలో జగన్ ను కలిసి తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడుగుదామన్నా కూడా ప్రస్తుతం సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఈ విషయంలో రఘురామకృష్ణం రాజు అయితే.. నేరుగానే అనేశారు కూడా. అయితే… కరోనా మిగిల్చిన కన్నీటి గాథలో భాగంగా వారి కోరిక మేరకు నిధులు కేటాయించే పరిస్థితి లేనందునే జగన్ ఎమ్మెల్యేలతో భేటీకి కూడా మరింతకాలం ఆగే ఆలోచన చేస్తున్నారే తప్ప మరొకటి కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయినా కూడా అధినేత పరిస్థితి అర్ధం చేసుకోకుండా అసంతృప్తిని వెళ్లబుచ్చుతున్నవారి లిస్ట్ జగన్ తీయించారంట. ఈ లిస్ట్ లో నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆనం వెంకట రామనారాయణ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కిలారు వెంకట రోశయ్య, ఆర్కే రోజా, ధర్మాన ప్రసాదరావు, కనుమూరు రఘురామకృష్ణం రాజు మొదలైనవారు ఉన్నారని తెలుస్తుంది. ఈ లిస్టులో రేపో మాపో మరి కొంత మంది కూడా చేరబోతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో… వీరే జగన్ ను అర్ధం చేసుకుని సర్ధుకుపోవడమా.. లేక జగనే వీరిని అర్ధం చేసుకుని సర్ధుబాటు చేయడమా.. పరిష్కారం ఏదవుతుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే!!