ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ఇచ్చిన హామీల్లో 90 శాతం తొలి ఏడాదిలోనే అమలు చేసి రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా జగన్ ప్రభుత్వం సన్నకారు రైతులకు మరో వరాన్ని ఇచ్చింది. ఇప్పటికే రైతాంగ సంక్షేమం వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించగా ..తాజాగా అయిదు ఎకరాల లోపు రైతుల కొరకు ఉచిత బోర్ వెల్స్ కార్యక్రమం అమలునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.
వ్యవసాయ భూముల్లో బోర్ లు, బావులు లేని చిన్న సన్నకారు రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన సమయంలో తమ మెట్ట పంటల తడులకు తీవ్ర వ్యయప్రయాసలు పడే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు చిన్న సన్నకారు రైతులకు ఉచిత బోర్ వెల్ పథకం చాలా ఉపయోగకరమని అంటున్నారు.
ప్రభుత్వం ఉచిత బోర్ వెల్ పథకానికి సంబంధించి విధి విధానాలను ప్రకటించింది. చిన్న సన్నకారు రైతులు తమ పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్లైన్లో బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. అనంతరం అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తును పంపుతారు..జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన రైతుల జాబితాలను డ్వామా పీడీలకు ఎంపీడీవోలు అందజేస్తారు. బోరు బావి మంజూరు సమాచారాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతులను తెలియజేస్తారు. అనంతరం బోరు డ్రిల్లింగ్ వేసే ముందు రైతు పొలంలో హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాతే బోర్లు వేస్తారు. రైతుకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. ఒకవేళ అర్జీ దాఖలు చేసుకునే రైతుకు అంత భూమి లేకపోతే పక్కనే ఉన్న వారితో కలిసి బోరు వేయించుకునే అవకాశం ఉంది. అయితే ఆ భూమిలో అంతకు ముందు ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదనే నిబంధన పెట్టారు.