YS Jagan: ఒక సంక్షేమ పథకం అమలు చేస్తే అది ప్రజలకు దగ్గరగా వెళ్లాలి. వారు ఎప్పుడూ గుర్తుపెట్టుకునేలా మిగిలిపోవాలి. ఈ విషయంలో వైయస్ రాజశేఖర్రెడ్డి ముందుచూపు వల్ల ఎన్నో కుటుంబాలు బాగు పడ్డాయి. ఎందరికో విద్యాదానం ఆరోగ్య దానం చేసిన గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత ఆయనది. అందుకే ఆయన చనిపోయినప్పుడు రాష్ట్రమంతా బోరున విలపించింది. ఇప్పటికీ చాలామంది ఇళ్లలో ఆయన ఫోటోలు దేవుడు బొమ్మ దగ్గరే ఉండడం గమనించవచ్చు.
ఆయన తీసుకొచ్చిన సంక్షేమ ఫలాలు అలాంటివి… ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వైయస్ జగన్ YS Jagan తీరు, ఆయన తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు కొన్ని ఆర్థికంగా పేదలకు దన్నుగా నిలిస్తే మరికొన్ని విచిత్రంగా అనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ బియ్యం డోర్ డెలివరీ పథకము అంటూ తీసుకొచ్చిన పథకం రెండు రోజులకే అభాసుపాలు అయ్యేలా కనిపిస్తోంది. అసలు పథకం ఉద్దేశమే నెరవేరిన దాఖలాలు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి గమనిస్తే డోర్ డెలివరీ వాహనాలు కేవలం ఒక దగ్గర పెట్టేసి… అక్కడ లబ్దిదారుల అందరినీ క్యూలో నుంచోమని రేషన్ ఇస్తున్నారు. దీంతో అసలు ఈ సంక్షేమ పథకాన్ని ఖర్చు పెట్టిన సొమ్ముకు అసలు లక్ష్యం నెరవేర్చుకున్న పోతుందనే భయం పట్టుకుంది.
ఇంత మాత్రం దానికేనా??
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డెలివరీ డోర్ డెలివరీ పథకం కింద 9 వేల వాహనాలను తీసుకొచ్చారు. వీటిని సబ్సిడీ కింద అందించారు. మొదట వాహన డ్రైవర్లకు 10000 జీతం ఇస్తామని చెప్పారు. దాని తర్వాత అది కాస్త తగ్గింది. దీంతోపాటు పంచాయతీ ఎన్నికలు ఉన్న దృష్ట్యా పట్టణాల్లో మాత్రమే వాహనాలు ప్రారంభించాలని ఎన్నికల కమిషన్ చెప్పడంతో గ్రామాల్లో రేషన్ డోర్ డెలివరీ జరగలేదు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ డోర్ డెలివరీ పథకం క్షేత్రస్థాయిలో సాధారణ రేషన్ డిపో లో ఎలా అయితే సరుకులు ఇస్తారో అదే తీరున సాగుతుండటంతో… సోషల్ మీడియా వేదికగా ఈ పథకం మీద ట్రోలింగ్ మొదలైంది. జగన్ ప్రభుత్వం ఎప్పుడు ఏం తప్పు చేస్తుందో అని కాచుకు కూర్చున్న ప్రతిపక్షాలు ఈ పథకం క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరును ఎండగడుతూ ఉన్నాయి. సుమారు వెయ్యి కోట్ల వరకు పథకం కోసం ఖర్చు పెట్టి, ప్రస్తుతం రేషన్ సరుకులు కు తీసుకున్న చందనే ప్రజలు ఈ వాహనాల వద్ద కూడా బారులు తీరి కనిపిస్తుండడంతో అసలు లక్ష్యం నీరుగారి పోతుంది.
అప్పుడే అసంతృప్తి!
పథకం మొదలవగానే వాహనాలు తీసుకున్న వారి దగ్గర నుంచి అసంతృప్తులను మొదలయ్యాయి. జీతాలు తగ్గించడంతో పాటు, వాహనాల్లో సరుకులు ఎక్కించుకునే బాధ్యత సైతం వాహన డ్రైవర్లకు అప్పగించడంతో వారు మూటలు మై లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఈ పథకం వల్ల రేషన్ డీలర్లకు కమిషన్ తగ్గింది. దీంతో వారు గుర్రు మీద ఉన్నారు. దీంతో వాహన డ్రైవర్లకు కనీసం వారు సహకరించని పరిస్థితి ఉంది. మీరే వచ్చి మూటలను తీసుకు వెళ్ళండి అని చెబుతున్నారు తప్ప కనీసం ఆ మూటలను వాహనం వద్దకు చేర్చే సహాయం కూడా రేషన్ డీలర్లు చేయడం లేదు. దీంతో అంతంత పెద్ద మూటలను మోయలేక వాహనం డ్రైవర్లు బెంబేలెత్తుతున్నారు. మరోపక్క ఈ పోస్టు మిషన్లు సైతం పనిచేయకపోవడంతో కొన్నిచోట్ల రేషన్ సరుకులు ఇవ్వడం ఆగిపోయింది. దీంతో ఇటు పని కాక అటు సరుకుల మూటలను ఎత్తలేక వాహనం డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. మొత్తానికి ఈ పథకం మొత్తం మీద బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. మరి దీనిని అధికారులు ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది అన్నది చూడాలి.