ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రానున్న ఐదు నెలలు జగన్ కి అత్యంత కీలకమైన సమయమని వారంటున్నారు.
రాజకీయాల్లో ఎప్పుడూ పూలదండలే కాదు.. రాళ్ల దెబ్బలు కూడా సిద్ధంగానే ఉంటాయి. ప్రస్తుతం ఏపీ సీఎం ఆ జోనార్ లో ఉన్నారట.జగన్ ఎదురుగా నిలిచి గెలవడం కష్టమని టీడీపీకి ఈపాటికే అర్ధమైపోతోంది. ఆయన చేతికి ఎముక లేకుండా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. ఇలాగే జోరు కొనసాగితే 2024 నాటికి కూడా ఆయన రెండవ విడత అధికారం లోకి రావడం సునాయాసమనే చెప్పాలి. మరి జగన్ ని గద్దె దింపే మార్గం ఏంటి అని ఆలోచన చేసిన టీడీపీ జగన్ పై వైసీపీ మీద ద్విముఖ వ్యూహం అవలంబిస్తోందని సమాచారం. జగన్ సర్కార్ కి వివిధ రాజ్యాంగ వ్యవస్థలకు మధ్యన ఎడం పెంచడం.
జగన్ మీద అదే పనిగా రాతలు రాస్తూ ఏపీలో ఏదో జరిగిపోతోందని కలరింగ్ ఇవ్వడం. మొదటి దాని వల్ల వచ్చేవి అతి సున్నితమైన ఇబ్బందులు, అవి ఏ వైపునకు దారితీస్తాయో చెప్పడం కష్టమే. ఇక రెండవ దాని ద్వారా వైసీపీలోనూ ఎమ్మెల్యేలలోనూ నైతిక స్థైర్యం దెబ్బతీయడం. ఇలా ద్విముఖ వ్యూహంతో టీడీపీ దాని అనుకూల మీడియా రెడీగా ఉన్నాయట.
మరో వైపు ఏపీలో పెను ఆర్ధిక సంక్షోభం వస్తుందని కూడా టీడీపీ ఆశ పెట్టుకుంటోంది. దాన్ని మరింత చేసి భయపెట్టడానికి ఎటూ అనుకూల మీడియా ఉంది. ఏపీలో కరోనా కారణంగా ఆదాయం దారుణంగా పడిపోయింది. మరో వైపు చూస్తే కేంద్రం సాయం కూడా తగ్గుతోంది.
దీంతో ఈ రెండింటికీ బ్యాలన్స్ చేయడం జగన్ కి కష్టమే కావచ్చు. తొలి ఏడాది ఎలాగోలా నెట్టుకువచ్చిన జగన్ రెండవ ఆర్ధిక సంవత్సరం ఇబ్బందుల్లో పెడితే అది రాజకీయ సంక్షోభంగా మలచాలని కూడా విపక్షం ఆశ పెట్టుకుంది. ఈ అయిదు నెలల్లోనే ఏపీలో అనేక కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందులో ప్రధానమైనది ఏమిటీ అంటే మూడు రాజధానుల మార్పు.
దీన్ని జగన్ ఎలా డీల్ చేస్తాడన్నది కూడా తేలాలి. మొత్తమ్మీద జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా జాగూరకత వహించాలని, లేనిపక్షంలో రాజకీయంగా పెద్ద దెబ్బే తగలగలదని జగన్ సన్నిహితులే ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. రాజకీయాల్లో ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు అని కూడా వారు అంటున్నారు. మరి జగన్ ఏ విధంగా విపక్షాలకు కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.