ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ సీఎం చంద్రబాబునాయుడు మాదిరి వీడియో కాన్ఫరెన్స్ల పట్ల మోజు పెంచుకున్నట్లు కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు.ఇది ప్రమాదకరమైన ధోరణి అని వారు హెచ్చరిస్తున్నారు.
జగన్ తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి జనం మధ్య ఉండి వారి సమస్యలు తెలుసుకుని పథకాలు అమలు చేసే వారని వారు గుర్తు చేస్తున్నారు. జగన్ కూడా తండ్రి పంధాని అవలంబిస్తే మంచిదని వైకాపా నేతలే సూచిస్తున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ లకే పరిమితమయ్యారు. పథకాల లబ్దిదారులతో మాట్లాడటం, వారు జగన్ ను కీర్తించడం పరిపాటిగా మారింది. ఎంపిక చేసిన లబ్దిదారులు కావడంతో సహజంగానే కీర్తనలు తప్ప విమర్శలు విన్పించవు. అవి చూసి జగన్ సంబరపడితే చాలదంటున్నారు.
కానీ వీడియోకాన్ఫరెన్స్ ల్లో విన్నది .. చూసింది నిజం కాదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయా? అన్నదే ప్రశ్న. ప్రధానంగా మధ్యతరగతి ప్రజల్లో జగన్ సర్కార్ పట్ల అసంతృప్తి పెరుగుతుందన్నది వాస్తవం. సంక్షేమ పథకాలన్నీ పేద వర్గాలకే అందచేస్తుండటంతో మధ్యతరగతి ప్రజలు అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. గడచిన ఏడాది కాలంగా ఏపీలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి
మరోవైపు సంక్షేమ పథకాల పేరిట జగన్ కొంతమందికే దోచిపెడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా అగ్రకులాల్లో కూడా అధమస్థాయిలో ఉన్నవారు లక్షల సంఖ్యలో ఉంటారు. కానీ వారికి సంక్షేమ పథకాలు అందడం లేదు. దీంతో వారంతా జగన్ సర్కార్ వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. ప్రధనంగా సోషల్ మీడియాలో సయితం జగన్ కు ఓసీ వర్గాల నుంచి విజ్ఞప్తులు అనేకం వస్తున్నాయి
కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేయడం సరికాదంటున్నారు. జేసీ వంటి సీనియర్ నేతలు సయితం ప్రభుత్వ పథకాలతో జగన్ ఇప్పటి నుంచే ఓట్ల కొనుగోళ్లు ప్రారంభించారంటున్నారు. ఇలా పథకాలను పెంచుకుంటూ కొన్ని వర్గాలకే పరిమితం చేస్తే జగన్ కు మిగిలిన వర్గాలు దూరమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే జగన్ క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్ లకే పరిమితమయితే ఫీల్ గుడ్ తప్ప మరేమీ కన్పించదు. ఈ తరహా భ్రమల్లో ఉండే చంద్రబాబు 2019 ఎన్నికల్లో దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేసుకుని అయినా జగన్ తన మార్గాన్ని మార్చుకుంటే మంచిదని వైకాపా నేతలు చెబుతున్నారు.
కేవలం సంక్షేమ పథకాలను అమలు పరిస్తే మరోసారి విజయం దక్కుతుందన్నది జగన్ ఆలోచన. గతంలో 2004లో తన తండ్రి వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలే 2009లో కూడా అధికారంలోకి తెచ్చిపెట్టాయని జగన్ గట్టిగా విశ్వసిస్తున్నారు.కానీ వైఎస్సార్ నిత్యం జనం మధ్య ఉండే వారన్న విషయాన్ని జగన్ గుర్తించాలని కోరుతున్నారు.మరి మన ముఖ్యమంత్రిగా ఆలకిస్తారా?లేదా ? చూడాలి !