తప్పు చేయడం అలవాటుగా మారిపోయిందో లేక దౌర్జన్యాలు చేయడం పరిపాటిగా మార్చుకున్నారో తెలియదు కానీ… మండలిలో టీడీపీ నేతలు మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు రోజ్జు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే గతంలో ఒకసారి మండలిలో జరుగుతున్న వ్యవహారాలను… నిలబడి తన సెల్ ఫోన్ లో వీడియోలు చిత్రీకరించారు.. అది సభాహక్కుల ఉల్లంఘనలోకి వస్తుందని, లోకేష్ పై చర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు స్పీకర్ కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో స్పీకర్ ఇచ్చిన చనువో లేక ఇంకెంతకాలం మండలిలో ఉంటాములే అన్న ఆలోచనతో తెలియదు కానీ… ఈసారి లోకేష్ తో పాటు మిగిలిన టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు! వీటికి సంబందించిన వీడియో సాక్ష్యాలను వైకాపా నేతలు విడుదలచేస్తున్నారు!
వివరాళ్లోకి వెళ్తే… ఏపీ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యంగా వ్యవహరించిందని ఆరోపించారు మంత్రి కన్నబాబు. శాసనమండలిలో చోటు చేసుకున్న సంఘటనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రంగా స్పందించారు. మండలి ప్రజాస్వామ్యబద్ధంగా నడవడం లేదని.. బడ్జెట్ ను కూడా ఆమోదించకుండా మండలిని వాయిదా వేసిన చైర్మన్ తీరు సరికాదని విరుచుకుపడ్డారు. అదంతా ఒకెత్తు అయితే… తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కుయుక్తులతో నడుస్తున్న మండలిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై దాడి జరిగిందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అన్నారు.
ఇందుకు గల ప్రూఫ్ లు తమవద్ద ఉన్నాయని చెబుతున్న వైకాపా నేతలు… తెలుగుదేశం ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, మంతెన సత్యనారాయణ రాజులు… మంత్రి వెల్లంపల్లిని కొట్టి, కాలితో తన్నారని వివరించారు. ఇదే క్రమంలో గతంలో మాదిరిగానే… మండలిలో తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్ సెల్ ఫోన్ తో వీడియోలు తీసుకుంటూ ఉండటం మీడియాకు విడుదల చేసిన వీడియోల్లో కూడా కనిపించింది. ఈ క్రమంలో మండలిలో సెల్ ఫోన్ ను ఆపమని డిప్యూటీ చైర్మన్ ఎన్ని సార్లు చెప్పినా లోకేష్ పట్టనట్టుగా వ్యవహరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వివరించారు.
అయితే… ఈ వ్యవహారాన్ని వైకాపా నేతలు అంతగా లైట్ తీసుకునే పరిస్థితి నేడు కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. ఈ వ్యవహారం మొత్తన్ని సీరియస్ గా తీసుకునే ఆలోచనలు చేస్తున్నారని.. దానికి కారణం మండలిలో టీడీపీ నేతల తీరు వైకాపా అసహనాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నట్టుగా ఉండటమే అని అంటున్నారు. దీనిపై పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూడాలి! కాగా… ఇప్పటికే మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించినా, ఢిల్లీలో అది పెండింగ్ ఉంది!!
ఇది పెద్దల సభ… ఆదర్శంగా నడవాల్సిన సభ… ఆమాత్రం ఆలోచన కూడా లేకుండా ఆ సభలో కొంతమంది “పెద్ద”మనుషులు అనబడేవారు మరీ చిల్లరగా ప్రవర్తిస్తున్నారని, పెద్దమనుషులు అంటే 100కిలోల బరువు ఉండటం కాదని గతంలో వైకాపా మంత్రులు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లకు బలం చేకూరేలా కొందరు ప్రవర్తించారని పలువురు అభిప్రాయపడుతున్నారు!